Trump Tariff India| అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతదేశం అధిక దిగుమతి సుంకాలు విధిస్తోందన్న కారణంతో.. ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రంప్ శక్తిమంతమైన దేశాలకు సమాన అధికారాలు ఉండే విధానం దిశగా సాగుతున్నారని కూడా జైశంకర్ వ్యాఖ్యానించారు.
లండన్ పర్యటనలో ఉన్న జై శంకర్ అక్కడ చాథమ్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో “ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర” అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ట్రంప్ పాలన, భారత్పై సుంకాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. “ట్రంప్ పాలన శక్తిమంతమైన దేశాలకు సమాన అధికారాలు ఉండే విధానం దిశగా సాగుతోంది. ఇది ఇండియా ఆలోచనలకు సరిపోతుంది. క్వాడ్లో ప్రతి దేశం తమ పాత్రను సక్రమంగా పోషిస్తోంది,” అని జైశంకర్ పేర్కొన్నారు.
భారత్పై సుంకాల గురించి మాట్లాడుతూ, జైశంకర్, “వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం ఆవశ్యకతపై మేము పరస్పర అంగీకారానికి వచ్చాం,” అని తెలిపారు.
Also Read: అమెరికాకు కరెంటు కోతలు.. స్టార్ లింక్ డీల్ రద్దు చేసిన కెనెడా
ట్రంప్ ప్రకటన ప్రకారం.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ముత్యాలు, రంగు రాళ్లు, ఔషధాలు.. ఆహార ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించబడతాయి. ఆ దేశంలో ఈ భారత ఉత్పత్తుల ధర పెరిగిపోతుంది. అమెరికా నుంచి భారత్కు దిగుమతి అయ్యే విద్యుత్ మెషినరీ, అణు రియాక్టర్లు, ఖనిజ ఇంధనాలు, లెన్సులు, మైక్రోస్కోపులు.. వైద్య పరికరాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఈ సుంకాల కారణంగా భారతదేశంలో రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు, ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ప్రభావితమవుతాయని అంచనా.
సుంకాల విధించడంలో భారత్ టాప్.. నిజమేనా?..
అయితే.. భారత్ను “సుంకాల రారాజు”గా పేర్కొనడం తగదని సెబీ ఛైర్పర్సన్ తుహిన్కాంత పాండే స్పష్టం చేశారు. ఆయన అందించిన వివరాల ప్రకారం, భారత్లో 8,562 అమెరికన్ ఉత్పత్తుల్లో 6,500 ఉత్పత్తులపై 10% కంటే తక్కువ సుంకాలు మాత్రమే విధించబడ్డాయి. అదే సమయంలో, భారత్ నుంచి అమెరికాకు చేసే ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 17.7% మాత్రమే ఉన్నాయి.
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడయ్యాక.. భారత్ నుంచి 761 మిలియన్ డాలర్ల స్టీల్, 382 మిలియన్ డాలర్ల అల్యూమినియం దిగుమతులపై 25 శాతం, 10 శాతం సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా.. భారత ప్రభుత్వం 2019లో 28 అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది.