US Attack : ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైన తర్వాత.. మధ్యప్రాశ్చంలో అమెరికా తీరు మరింత కఠినంగా మారనుంది. ఈ మేరకు సంకేతాలిచ్చిన అమెరికా శనివారం రాత్రి.. హూతీ తిరుగుబాటుదారులపై విరుచుకుపడింది. తన అత్యాధునికి యుద్ధ విమానాలతో టార్గెటెడ్ దాడులు చేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్ మద్ధతుతో యెమెన్ లో దాగి ఉన్న హూతీ తిరుగుబాటు దారులు.. అక్కడి కొన్ని ప్రాంతాల్లో భారీగా ఆయుధ నిల్వలను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని గుర్తించిన అమెరికా సైన్యం.. మూడు చోట్ల దాడులకు దిగింది. వీరంతా త్వరలోనే అంతర్జాతీయ జలాల్లోని నౌకలే లక్ష్యంగా దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని వెల్లడించిన అమెరికా, వారి ప్రయత్నాల్ని నిలువరించినట్లు తెలిపింది.
కాగా.. గాజాలో ఇజ్రాయిల్ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న హూతీలు, అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే.. తాము అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న దేశాల నౌకలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. చెప్పినట్లుగానే.. అనేక సార్లు ఇంటర్నేషనల్ సీ బోర్డర్ లో దాడులకు తెగబడిన హూతీలు.. కొన్ని నౌకల్ని ఇబ్బందులకు గురి చేశారు. దాంతో.. ఈ ఏడాది జనవరిలో తొలిసార హూతీ తిరుగుబాటుదారులపై ఆమెరికా, బ్రిటన్ సైన్యం సంయుక్తంగా దాడులకు దిగాయి. వివిధ టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించాయి. అప్పటి నుంచి హూతీలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. వారి కార్యకలాపాలు యాక్టీవ్ అవుతున్న సందర్భాల్లో దాడులు చేసి నష్టం కలిగిస్తోంది.
ఈ దాడుల్లో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వ్యాప్తంగా.. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే సైనిక, పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే అధునాతన సంప్రదాయ ఆయుధాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకునేందుకు
సిద్ధం చేసిన అత్యాధునిక ఆయుధాలను పేల్చేశామని పెంటగాన్ వివరణ ఇచ్చింది.
అక్టోబర్ మధ్యలో కూడా అమెరికాకు చెందిన అత్యాధునిక బి-2 బాంబర్లు భారీ బంకర్ బస్టర్ బాంబులతో ఆయుధ డిపోలను పేల్చేశాయి. మిడిల్ ఈస్ట్లో శాంతి నెలకొల్పేందుకు F-15 ఫైటర్ జెట్తోపాటు బాంబర్స్, ట్యాంకర్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్ను మిడిల్ ఈస్ట్ కు పంపిన అమెరికా.. అక్కడి పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తోంది.
Also Read : ఎక్కువ మంది పిల్లల్ని కనిపించేందుకో మంత్రిత్వ శాఖ.. ఆ దేశంలో అంతే మరి
అమెరికా ఎన్నికల్లో తాజాగా విజయం సాధించిన ట్రంప్.. ఇరాన్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. ఆమెరికా ప్రయోజనాలతో పాటు దాని మిత్ర దేశాల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసిన ట్రంప్.. అవసరమైతే భారీ దాడులు చేస్తామని హెచ్చరించారు. గతంలోనూ.. ఇక్కడి యుద్ధ పరిస్థితులపై ట్రంప్ ఇదే తీరుగా వ్యవహరించారు. ఇప్పుడు.. రెండో సారి అధికారాలు చేపడుతున్న క్రమంలో.. ట్రంప్ వ్యవహారం ఎలా ఉండనుందో మరోసారి స్పష్టమైంది.