US China Tariff Trade War| అమెరికా (USA) ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో తాము ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదని చైనా (China) చేతలతో చెప్పింది. అందుకుగాను అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల ఉత్పత్తులకు వర్తిస్తుందని చైనా స్టేట్ కౌన్సిల్ టారిఫ్ కమిషన్ తెలియజేసింది. ఈ కొత్త పన్నులు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రాబోతున్నాయి. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధమని చైనా ఆరోపిస్తూ.. ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా తమపై ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తోందని చైనా విమర్శించింది.
“చైనా టారిఫ్ చట్టం, కస్టమ్స్ చట్టం, విదేశీ వాణిజ్య చట్టం, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం.. స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్ 10 నుంచి అదనపు సుంకాలు విధించబడతాయి” అని టారిఫ్ కమిషన్ ప్రకటించింది.
ఈ కొత్త నిర్ణయం ద్వారా ప్రస్తుతం అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఉన్న పన్నులకు అదనంగా ఈ కొత్త టారిఫ్లు విధించబడతాయి. అయితే, ఇప్పటికే అమలులో ఉన్న పన్నులు, ఇతర మినహాయింపు విధానాలు కొనసాగుతాయి. మే 13 నాటికి అమెరికా సరకులు చైనా చేరుకుంటే, వాటికి మినహాయింపు లభిస్తుంది.
గతంలో ట్రంప్ 34 శాతం అదనపు సుంకాలు విధించిన విషయంలో చైనా తీవ్రంగా ప్రతిస్పందించింది. తాము తగిన రీతిలో ప్రతిచర్య తీసుకుంటామని చైనా పేర్కొంది. చైనా నుండి అమెరికాకు ప్రతి సంవత్సరం సుమారు 438 బిలియన్ డాలర్ల మొత్తంలో వస్తువులు ఎగుమతి అవుతున్నాయి.
అమెరికాతో వాణిజ్య చర్చల గురించి చైనా స్పందిస్తూ.. వాణిజ్య సమస్యలపై ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదించుకుంటున్నామని తెలిపింది. సమాన హోదాలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని చైనా ప్రభుత్వం పేర్కొంది.
“చైనా తదితర దేశాలపై అమెరికా పరస్పర సుంకాలు విధించింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నియమాలకు పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను పట్టించుకోకుండా ఈ చర్యలు తీసుకుంది. మా హక్కులను రక్షించుకునేందుకు మేము ప్రతిస్పందించే అధికారం కలిగి ఉన్నాము” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వివరించారు.
ఆసియా, యూరోపియన్ యూనియన్ దేశాల తర్వాత అత్యధికంగా చైనా వస్తువులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. 2024లో అమెరికా-చైనా మధ్య మొత్తం వాణిజ్యం 582.4 బిలియన్ డాలర్లు. అమెరికా నుండి చైనా దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 143.5 బిలియన్ డాలర్లు.
Also Read: ట్రంప్నకు భారీ జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు.. గూఢాచారి కేసులో చుక్కెదురు
చైనా భయపడింది, తప్పుచేసింది: ట్రంప్
అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా చర్యలు చైనా కూడా అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా భయభ్రాంతమైందని, తప్పుడు నిర్ణయం తీసుకుందన్నారు. “చైనా తప్పు చేసింది. వారు భయభ్రాంతులయ్యారు. వారికి ఇంకేమీ చేయడానికి లేదు” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ చేశారు.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల మధ్య సుంకాల యుద్ధం..!
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనాల మధ్య టారిఫ్ యుద్ధం తీవ్రమవుతోంది. ఇరు దేశాలు పరస్పరం అధిక సుంకాలు విధిస్తున్నాయి. ఎవరూ వెనుకడుగు వేయకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతోంది. ఈ వివాదం టారిఫ్ వరకే పరిమితమవుతుందా లేక ఇంకా గంభీరమైన పరిణామాలకు దారితీస్తుందా అనేది ప్రశ్న. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సుంకాలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కూలదీశే ప్రమాదముంది.