Volcano in Indonesia spews lava and smoke: ఇండోనేషియాలో రుయాంగ్ అగ్నిపర్వతం పేలింది. అగ్ని పర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా, బూడిద, పొగ వెదజల్లుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అగ్ని పర్వతం యాక్టివ్ గా ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడితే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 1871లో ఇదే విధంగా ఇండోనేషియాలో భారీ సునామీ వచ్చింది.
అయితే మరో సారి సునామీ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉండగా.. దాని నుంచి పెద్ద ఎత్తున లావా, పొగ, బూడిద వ్యాపిస్తోంది. కానీ అగ్ని పర్వతంలోని కొంత భాగం బలహీనంగా ఉండటంతో అది ఏ సమయంలోనైనా సముద్రంలో కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే భారీ సునామీ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అగ్నిపర్వత విస్పోటన ఘటనకు సంబంధించి ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ కౌంటర్ మెజర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విస్ఫోటనం ప్రారంభ దశలో 838 మందిని సితారో దీవుల రీజెన్సీ, నార్త్ సులవేసి నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొంది. మరోవైపు సునామీ వచ్చే అవకాశం ఉండటంతో అలల ఎత్తును అంచనా వేస్తున్నట్లు వాతావరణ సంస్థ తెలిపింది.
ALSO READ:Russian Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా మిస్సైల్ అటాక్.. 17 మంది మృతి
ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైతం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడూ పరిస్థితిని పర్యవేక్షిస్తూ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.