Murder Over Water: మనిషి ప్రాణం కంటే నీటి చుక్కే విలువైందిగా మారుతున్న దుస్థితి ఇది. క్షణికావేశం, సహనం నశించడం వెరసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో తాగునీటి కోసం జరిగిన చిన్న ఘర్షణ ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. బిందెడు నీళ్ల కోసం సాటి మనిషిని కిరాతకంగా నరిపి చంపిన ఘటన గుంతకల్లులో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లు ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కురుబ చంద్ర అనే వ్యక్తికి, అదే వీధిలో నివసించే శివ అనే వ్యక్తికి మధ్య పరిచయం ఉంది. అయితే, గురువారం తాగునీటి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నీళ్లు ఎవరు ముందు పట్టుకోవాలనే దానిపై మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.
మాటామాటా పెరగడంతో ఇరువురు పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శివ.. విచక్షణ కోల్పోయాడు. క్షణికావేశంలో తన వద్ద ఉన్న వేట కొడవలిని తీసుకొచ్చి చంద్రపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వేట కొడవలితో బలంగా నరకడంతో చంద్ర రక్తపు మడుగులో కుప్పకూలి, ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, చంద్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాగునీటి కుళాయి వద్ద జరిగిన గొడవే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం నీటి కోసం జరిగిన గొడవలో నిండు ప్రాణం పోవడంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.