Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
అసలే దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి ఆస్థానం సైతం స్వామి వారి సన్నిధిలో నిర్వహించడం ఆనవాయితీ. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే టీటీడీ పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశ విదేశాల నుండి స్వామి వారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. ఇలా తిరుమల భక్తుల గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతోంది.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన పుణ్యక్షేత్రం తిరుమలలో నవంబర్ నెలకు సంబంధించి, జరిగే విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.
Also Read: Dhanteras Lucky Zodiacs: ధన్తేరాస్లో ఈ 3 రాశులు బంగారం, సంపద పొందబోతున్నారు
నవంబర్ నెలలో జరిగే పర్వదినాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 69,333 మంది భక్తులు దర్శించుకోగా.. 22,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.53 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు చేయాలని తితిదే నిర్ణయించింది. ప్రొటోకాల్ ప్రముఖలు మినహా.. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది..