![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/stock-market.jpg)
Stock Markets : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ నూ లాభాల్లోనే ముగించాయి. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెద్దగా పెంచదనే అంచనాలు… ఆసియా మార్కెట్లలో సానుకూలత… విదేశీ మదుపర్ల కొనుగోళ్లు… మార్కెట్లను ఆద్యంతం లాభాల్లోనే నడిపించాయి. ఉదయం 61 వేల పాయింట్ల పైన లాభాల్లో మొదలైన సెన్సెక్స్… ఇంట్రాడేలో 61,290-60,869 పాయింట్ల మధ్య చలించింది. ఓ దశలో 500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 61,121 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి… 18,145 పాయింట్ల దగ్గర క్లోజైంది.
సెన్సెక్స్ 30 సూచీలో 24 షేర్లు లాభపడగా… 6 నష్టపోయాయి. ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, విప్రో షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్లలో యాక్సిస్ బ్యాంక్, మారుతీ, రిలయన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
మరోవైపు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. సోమవారం 34 పైసలు నష్టపోయి 82 రూపాయలా 81 పైసల దగ్గర ముగిసిన రూపాయి… మంగళవారం 10 పైసలు లాభపడి… 82 రూపాయలా 71 పైసల దగ్గర ముగిసింది.