భారతదేశంలో ధూమపానం చేసే వారికే కాదు, చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడం కోసం ఎన్నో అధ్యయనాలు జరిగాయి. అధ్యయనంలో ధూమపానం చేయని వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం వాయు కాలుష్యం. ఢిల్లీ లాంటి నగరాలలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, మెట్రో నగరాలన్నింటిలోనూ వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీని వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి. మనదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎక్కువమంది స్మోకింగ్ చేయని వారే కావడం గమనార్హం. వీరందరికీ వాయు కాలుష్యం వల్లే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు
ఊపిరితిత్తుల్లో ఏ భాగానికి క్యాన్సర్ సోకింది అనే దానిపై కనిపించే లక్షణాలు ఆధారపడతాయి. ముఖ్యంగా దగ్గు అధికంగా వస్తుంది. శ్వాస ఆడటానికి ఇబ్బంది పెడుతుంది. క్యాన్సర్ ఎక్కడ సోకినా కూడా ఈ రెండు లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. దగ్గు నిరంతరంగా ఆగకుండా వస్తూనే ఉన్నా క్యాన్సర్ ఉందేమోనని అనుమానించాల్సిందే. అలాగే దగ్గుతో పాటు రక్తపు చుక్కలు కనిపించినా కూడా జాగ్రత్తపడాలి. దగ్గుతున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు, శ్వాస లోతుగా తీసుకుంటున్నప్పుడు, ఛాతీ, భుజాలు, వీపులో నొప్పిగా అనిపిస్తుంది. బరువు హఠాత్తుగా తగ్గిపోతూ ఉంటారు. 24 గంటలు అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. గొంతు బొంగురు పోయినట్టు అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ముఖం లేదా మెడలో వాపు కనిపిస్తుంది. మింగడంలో కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే వేళ్ళు ఉబ్బినట్టు అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలే. మీకు వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం అత్యవసరం.
ఊపిరితిత్తుల క్యాన్సర్లో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, అడెనోకార్సినోమా, లార్జ్ సెల్ కార్సినోమా, స్క్రామస్ సెల్ కార్సెనోమా, స్మాల్ సెల్ లంగ్స్ క్యాన్సర్ వంటివి ఉన్నాయి. వీటిలో ఏది వచ్చినా ప్రమాదమే.