డయాబెటిస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి. అంటే అనారోగ్యకరమైన పద్ధతులు పాటించడం వల్ల చెడు ఆహార అలవాట్ల వల్ల నిద్రలేమి వల్ల వచ్చే ఒక వ్యాధి. నేటి యువత కూడా మధుమేహ బాధితులుగా మారిపోతున్నారు. డయాబెటిస్ వచ్చినప్పుడు క్లోమంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
చక్కెర స్థాయిలని నియంత్రించుకోకపోతే శరీరంలోని అనేక ప్రధాన అవయవాలకు ఇబ్బందులు ఏర్పడతాయి .కాబట్టి చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులతో పాటు మీరు కొన్ని రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే కూరగాయలు ఏమో తెలుసుకోండి.
కాకరకాయ
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ తినాల్సిన వాటిలో కాకరకాయ ఒకటి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో పాలీపెప్టైడ్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఈ పాలీపెప్టైడ్ ఎంతగానో సహాయపడుతుంది. కాకరకాయ తరుచూ తినేవారిలో శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. కాకరరసం తాగడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాకర రసం తాగలేని వారు కాకరకాయను ఉడికించి తిన్నా మంచిదే. లేదా కూరలా వండుకొని తినేందుకు ప్రయత్నించండి.
సొరకాయ
సొరకాయ మార్కెట్లో తక్కువ దొరికే లభిస్తుంది. కానీ దీన్ని వండుకొని తినేవారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి సొరకాయని తినడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో సొరకాయ తినాల్సిన అవసరం ఉంది. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చక్కెర స్థాయిలు నియంత్రించే జీర్ణ వ్యవస్థను ఇది కాపాడుతుంది. సొరకాయని తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య కూడా రాదు. డయాబెటిక్ రోగులు సొరకాయను రైతా రూపంలో లేదా సూప్ రూపంలో తినడం మంచిది. అలాగే దాన్ని ఉడికించి కూరలా వండుకొని తిన్నా ఉత్తమమే. లేదా సొరకాయని ఉడకబెట్టి దానిపై కాస్త చిటికెడు ఉప్పు చల్లుకొని తినేందుకు ప్రయత్నించండి.
బెండకాయ
బెండకాయతో చేసే వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. కాని దాన్ని వేపుడు రూపంలో కాకుండా పులుసు లేదా కూర రూపంలో ఉడికించుకుని తినడమే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వేసవికాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన వాటిలో ఈ బెండకాయ ఒకటి. దీనిలో కరిగే ఫైబర్ ఉంటుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదించేలా చేస్తుంది. అన్నట్టు బెండకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి ఇది ఎంత తిన్నా కూడా చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి.
ఇక్కడ మేము చెప్పిన మూడు రకాల కూరగాయలు కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉండేవి. పేదల నుంచి ధనవంతుల వరకు అందరికీ ఇవి తక్కువ ధరలోనే లభిస్తాయి. కాబట్టి మధుమేహ రోగులు వీటిని ప్రతిరోజు తినేందుకు ప్రయత్నిస్తే మంచిది.