Chitrapuri Scam: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ రో-హౌస్ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Read also-‘హరుడు’ సినిమాలో గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకుంటున్న నటి వేద్విక సోని..
హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని చిత్రపురి కాలనీలో గల ‘రో హౌస్ నంబర్ 57’కు సంబంధించి గౌరవ తెలంగాణ హైకోర్టు 2023 జూన్ 26న (WP. NO: 16349/23) “కీప్ ది లాక్ & కీప్ ది కీ” (యథాతథ స్థితిని కొనసాగించాలి) అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆర్డర్ వచ్చిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే (2023 జూన్ 28న) ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిపోవటం గమనార్హం.
రో హౌస్ అసలు హక్కుదారుడైన రమేష్ బాబు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన వివరాల ప్రకారం.. మాజీ అల్లాట్మెంట్ కమిటీ సభ్యుడు జల్లా మధుసూదన్ పేరిట ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది. ఇందుకోసం రూ. 48,50,000 చెల్లించినట్లు చూపించి, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. కానీ, అందులో రూ. 29,32,500 సొమ్ము ఇప్పటివరకు చిత్రపురి సొసైటీ బ్యాంక్ ఖాతాకు జమ కాలేదని ఆర్టీఐ ద్వారా పక్కా ఆధారాలతో వెల్లడైంది. ఈ వ్యవహారం బయటపడటంతో.. పది లక్షలు సర్దుబాటు చేశామని, రూ. 19 లక్షలు మాత్రమే బాకీ ఉందంటూ పాత కమిటీ సభ్యులు కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.
ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక అప్పటి చిత్రపురి అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి సత్యనారాయణ దొర, కమిటీ సభ్యులు అలహరి వి.వి. ప్రసాదరావు, కొంగర రామకృష్ణ ప్రసాద్లతో పాటు ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి రంగారెడ్డి జిల్లా డీసీవో ధాత్రీదేవి, అలాగే గతంలో ఏసీబీ దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులతో దొరికిన శేరిలింగంపల్లి ఎస్ఆర్వో మధుసూదన్ రెడ్డిలు కుమ్మక్కై ఈ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read also-నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!
చిత్రపురిలో 2003-2020 మధ్యకాలంలో రూ. 116 కోట్ల అక్రమాలు జరిగినట్లు యాక్ట్-51 నివేదిక ఇచ్చినా, తదుపరి సెక్షన్-60 సెర్చార్జ్ నివేదికలు వచ్చినా అధికారులు వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా డీసీవో సి. సుధాకర్ కూడా హైకోర్టుకు, ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్కు తప్పుడు సమాచారం ఇస్తూ అక్రమార్కులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు రమేష్ బాబు ఆరోపించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, బాధ్యులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సహకార శాఖ మంత్రి చిత్రపురి అవినీతిపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.