Dora Sai Teja:వర్టికల్ స్టోరీస్లో ఛాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్తో హీరో దొర సాయి తేజ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్లో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సక్సెస్ ఫుల్ సందర్భంలో దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైన జర్నీ, సోషల్ మీడియా అనుభవాలు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి పంచుకున్న ముచ్చట్లు మీకోసం.
దొర సాయి తేజ సినీ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం ద్వారా ఆయన ఈ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’, ‘హై స్కూల్’ వంటి సిరీస్లలో, ‘అలా మొదలైంది’ చిత్రంలో చిన్న పాత్రల్లో నటించారు. 2016లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఏర్పడిన అనుబంధం ఆయనకు సినిమా మేకింగ్పై స్పష్టతనిచ్చింది. 2018 నుంచి ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్తో యూట్యూబ్లో వరుస ప్రాజెక్ట్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకే సమయంలో నటుడిగా, ప్రొడ్యూసర్గా, కంటెంట్ క్రియేటర్గా రాణిస్తున్న తేజ, ప్రతిరోజూ కొత్తగా ఆలోచిస్తుంటానని తెలిపారు.ఇక కంటెంట్ క్రియేషన్ అనేది తనకు ఒక బిజినెస్ అయితే, సినిమాలు చేయడం తన అసలైన ప్యాషన్ అని చెప్పారు. సమయాన్ని వృథా చేయకుండా ఎప్పుడూ పనిపైనే దృష్టి పెడతానని, ప్రతి అనుభవం నుంచి కొత్త గుణపాఠాలు నేర్చుకుంటూ తన వయసు కంటే పరిణతితో ఆలోచిస్తానని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలను, విమర్శలను రెండింటినీ సమానంగా స్వీకరిస్తానని తేజ తెలిపారు. ఇన్ఫ్లూయెన్సర్లు చేసే పనులు, వేసుకునే బట్టలు కూడా సమాజంపై ప్రభావం చూపుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇక ఈ ప్లాట్ఫామ్ను ఒక వంతెనలా వాడుకుని, డిజిటల్ స్పేస్ ద్వారా సంపాదించుకున్న అభిమానాన్ని థియేటర్ల వరకు తీసుకురావడమే తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.
also read:డీ.సీ.మూవీ రివ్యూ.. హీరోగా లోకేష్ కనగరాజ్ పర్ఫామెన్స్ ఎలా ఉంది?
‘దందా’ సిరీస్లో అరవింద్ పాత్రకు దక్కుతున్న రెస్పాన్స్ పట్ల తేజ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కేవలం ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాగా, ఈ సిరీస్లో పూర్తి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చిందన్నారు. నటుడిగా ప్రతి సీన్ను మొదటి టేక్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. ఇక దర్శకుడు ఆదిత్య విజన్ వల్లే ఈ ప్రాజెక్ట్ 7 రోజుల్లో, 30 కాల్షీట్స్లో అద్భుతంగా పూర్తయిందని తెలిపారు.
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆగకుండా పరిగెత్తి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో దొర సాయి తేజ ముందడుగు వేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకుంటూ, జీరో నుంచి హీరోగా ఎదిగే ప్రేరణాత్మక పాత్రలతో థియేటర్లలో అలరించడమే తన తదుపరి లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇక సరికొత్త ఆలోచనలతో ప్రయాణిస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం..