Adluri Laxman: భారత కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలనే డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ‘కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి’ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై తన పూర్తి మద్దతును ప్రకటించారు.
పార్లమెంట్ సాక్షిగా సుదీర్ఘ పోరాటం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరెన్సీపై అంబేద్కర్ రూప చిత్రాన్ని తేవడం కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతోందని గుర్తుచేశారు. దాదాపు 26 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ ఈ డిమాండ్పై ఢిల్లీ వీధుల్లో నిరసనలు, ధర్నాలు కొనసాగాయని తెలిపారు.
అంబేద్కర్ లేకపోతే హక్కులు లేవు
అంబేద్కర్ లేకపోతే బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల పరిస్థితి ఊహించడానికే భయంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే, ఆయన కల్పించిన హక్కుల కారణంగానే ఈరోజు నా లాంటి దళిత బిడ్డ రాష్ట్రానికి మంత్రి కాగలిగాడు’ అని మంత్రి అడ్లూరి భావోద్వేగంగా పేర్కొన్నారు.
గాంధీతో సమానమైన గౌరవం ఇవ్వాలి
మహాత్మా గాంధీకి దేశంలో ఇచ్చే గౌరవంతో పాటు, రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ కు కూడా కరెన్సీ నోట్లపై స్థానం కల్పిస్తూ సమాన గౌరవం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత, బహుజనుల ఉద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహానీయుడిని గౌరవించుకోవడం మన బాధ్యతని స్పష్టం చేశారు.
కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం
ఈ అంశం ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ దృష్టికి దీనిని తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, ఆయనకు తగిన గుర్తింపు లభించే వరకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ ధర్నా వేదికగా పునరుద్ఘాటించారు.
Also Read: చంద్రుడిని ఢీ కొట్టిన రాకెట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!