Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ హరిహర వీరమల్లు’ సినిమాకు ఇప్పుడు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 24వ తేదీన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో.. ఈ సినిమాకి బిజినెస్ కష్టాలు ఏర్పడడం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక స్టార్ హీరో.. పైగా చాలా ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు ..ఇలాంటి సమయంలో ఈ సినిమాకు బిజినెస్ జరగకపోవడం ఏంటి? అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు నైజాం ఏరియాలో ఈ సినిమా విడుదల అడ్డుకుంటాము అంటూ డిస్ట్రిబ్యూటర్లు కంప్లైంట్ రైజ్ చేయడం మరింత ఆశ్చర్యంగా మారింది. ఒప్పందం ప్రకారం రిఫండ్ చేస్తేనే సినిమా రిలీజ్ చేస్తామని, లేకపోతే విడుదల కష్టమే అంటూ డిస్ట్రిబ్యూటర్స్ రైజ్ చేసిన కంప్లైంట్ లో స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఏ.ఎం.రత్నంకి వ్యతిరేకంగా కంప్లైంట్ రైజ్ చేసిన ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. హరిహర వీరమల్లు నిర్మాత ఏ.ఎం.రత్నంకు వ్యతిరేకంగా ఇప్పుడు రెండు కంప్లైంట్లు డిస్ట్రిబ్యూటర్స్ చేయడం జరిగింది. అందులో మొదటిది ఏ ఎమ్ రత్నం శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ‘ఆక్సిజన్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా హక్కులను నైజాం ఏరియాలో ఆసియన్ ఎంటర్ప్రైజెస్ వారు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసే సమయంలోనే.. సినిమాకు సరైన కలెక్షన్స్ రాకపోతే రిఫండబుల్ చేసేలా ఒప్పందం కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే ఆక్సిజన్ చిత్రం థియేట్రికల్ హక్కులను ఏషియన్ ఎంటర్ప్రైజెస్ కొనుగోలు చేయగా.. ఈ సినిమాతో సుమారుగా వడ్డీతో కలిపి రూ.2,60,42,548 నష్టం వాటిల్లింది అని.. ఇక ఒప్పందం ప్రకారం రిఫండబుల్ అడ్వాన్స్ మొత్తాన్ని రికవరీ చేయాలి అని ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు ఏషియన్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్.
బకాయిలు చెల్లించకపోతే నైజాంలో సినిమాను అడ్డుకుంటాం – మహాలక్ష్మి ఫిలిమ్స్
ఇక రెండవ కంప్లైంట్ విషయానికి వస్తే.. మహాలక్ష్మి ఫిలిమ్స్ వారు ‘ముద్దుల కొడుకు’, ‘బంగారం’ చిత్రాలకు సంబంధించి రూ.90 లక్షల బ్యాలెన్స్ రిఫండబుల్ డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ను రికవరీ చేయాలి అని ఏ.ఎం. రత్నంపై కంప్లైంట్ చేశారు. ఇకపోతే ఈ రెండు కంప్లైంట్ లను 2015 డిసెంబర్ 14వ తేదీన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించారు కూడా.. అంతేకాదు ఈ ఏడాది జూలై 15వ తేదీన మా సభ్యుల పర్యవేక్షణలో మళ్లీ చర్చించడం జరిగింది. మొత్తంగా ఆ రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు.. తమకు చెల్లించాల్సిన రూ.3,50,42,548 మొత్తం డబ్బును రికవరీ చేస్తేనే.. నైజాం ఏరియాలో ఈ సినిమాను రిలీజ్ చేయిస్తామని.. లేకపోతే అడ్డుకుంటామని తమ కంప్లైంట్ లో వెల్లడించారు.
ఫ్రెండ్ తో నైజాంలో రిలీజ్ చేయిస్తున్న ఏఎం రత్నం..
ఇకపోతే ఏ.ఎం.రత్నం నైజాం ఏరియాలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు ధర భారీగా పెంచేశారు. అందుకే అటు దిల్ రాజు (Dil Raju) కానీ ఇటు నాగవంశీ (Naga Vamshi) కానీ ఎవరూ కూడా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి సాహసం చేయలేదు. అందులో భాగంగానే ఇప్పుడు తన సన్నిహితుడుకి దాదాపు రూ. 40 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అమ్మేశారు. అలా ఈ సినిమాను ఏఎం రత్నం స్నేహితుడు నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తున్నారు.
నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వడం కష్టమేనా?
ఇక ప్రస్తుతం ఈ సినిమాకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తేనే విడుదల చేయిస్తామని డిస్ట్రిబ్యూటర్స్ అడ్డుపడుతున్నారు. ఒకవేళ ఏ.ఎం. రత్నం ఆ డబ్బును చెల్లించ లేకపోతే ఈ సినిమా నైజాం ఏరియాలో రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తోంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ALSO READ:Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ కొడుకు మూవీ ఆగిపోవడానికి కారణం?