Priyamani: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో అలరించి, వెర్సటైల్ యాక్ట్రెస్ అనిపించుకున్న ప్రియమణి (Priyamani), మళ్లీ టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ను అద్భుతంగా మలచుకుంటున్న ప్రియమణి, కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా దూసుకెళ్లిన ఈ భామ, రేసులో కాస్త వెనుకబడి.. బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. అక్కడ వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, మంచి నటిగా గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. దాదాపు రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్న ఈ భామకు టాలీవుడ్ నుంచి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read- Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!
ఆ బంపరాఫర్ మరేదో కాదు.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బాబీ (Bobby) కాంబినేషన్లో రూపుదిద్దుకోబోతున్న ‘మెగా158’ (Mega158) చిత్రంలో నటించేందుకు ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకుగానూ ఈ భామకు భారీ పారితోషికం ఇవ్వడానికి చిత్రయూనిట్ సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున వంటి అగ్ర హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లతో సినిమాలు చేస్తుంటే, ట్రోల్స్ చేస్తున్నారు. కుమార్తె వయసున్న అమ్మాయితో సినిమాలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే కాస్త రూటు మార్చి సీనియర్ నటీమణులనే ఈ హీరోలు చూజ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో నయనతార (Nayanthara) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆమెను ఒప్పించడానికి అనిల్ రావిపూడి చాలానే తంటాలు పడ్డాడట.
ఇక ప్రియమణి విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి సరసన చేయాలని ప్రియమణి కూడా ఆ మధ్య తన కోరికను వెల్లడించింది. అందుకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఆమె భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. వివిధ భాషల్లో ఇంత సుదీర్ఘ కాలం పాటు తన క్రేజ్, వాణిజ్య విలువను కాపాడుకుంటున్న అతికొద్ది మంది నటీమణులలో ప్రియమణి ఒకరని, ప్రస్తుతం ఆమె అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే నిజమే అనిపిస్తుంది. ‘మెగా158’ చిత్రంలో చిరంజీవి సరసన ఒక ప్రాముఖ్యత ఉన్న మహిళా పాత్ర ఉండగా, ఆ పాత్ర కోసం ప్రియమణిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రియమణికి రూ. 1 కోటి పైగా రెమ్యూనరేషన్తో పాటు ఇతర అదనపు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లుగా సమాచారం. అదనపు సౌకర్యాలు అంటే, ఆమె బాలీవుడ్లో ప్రస్తుతం బిజీ నటిగా ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లే ఖర్చులు అయ్యిండవచ్చు. ఇంకా తన స్టాఫ్ వ్యవహారాలు కూడా నిర్మాణ సంస్థే చూసుకుంటుందని తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే, ప్రియమణికి బంపరాఫర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ను మార్చిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు.