Rahul Ramakrishna: టాలీవుడ్ ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖల పరిధిలోని పలు చట్టాల అమలు, పారదర్శకతపై రాహుల్ ఘాటు ప్రశ్నలు సంధించారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకుంటూనే, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు. రాహుల్ రామకృష్ణ తన ట్వీట్లలో లేవనెత్తిన ప్రధానాంశాలు ఇవే.
Read also-సరికొత్త ‘మింట్’ కలర్లో Samsung Galaxy A27.. లాంచ్కు ముందే లీకైన వివరాలు!
పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న కీలక శాఖల పనితీరుపై రాహుల్ మొదటి ట్వీట్ చేశారు. గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల హక్కులకు సంబంధించిన PESA చట్టం (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం), 1/70 చట్టం, మరియు గ్రామసభ చట్టం క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయో, వాటికి సంబంధించిన అధికారిక ఫలితాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో పాటు, అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీకరణ కార్యక్రమాల గణాంకాలను ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ లెక్కలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని, ఒక స్వతంత్ర సంస్థ వెల్లడించిన నివేదికలతో ఇవి సరిపోలడం లేదని ఆరోపించారు. తాను స్వయంగా సేకరించిన సమాచారం ఆధారంగానే ఈ ప్రశ్నలు అడుగుతున్నానని స్పష్టం చేస్తూ, ఈ ట్వీట్ చివరలో ‘జై తెలంగాణ!’ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది.
మరో ట్వీట్లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శాఖల్లోని పారదర్శకతను రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు. “మీరు ఎప్పుడూ ప్రదర్శించే ఆర్భాటాలు (Bravado) పక్కన పెట్టి, మీరు హోల్డ్ చేస్తున్న ప్రతి విభాగంలో సమాచార హక్కు చట్టం (RTI) లోని సెక్షన్ 4.1(బి) ని కచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా చెప్పండి సర్?” అని నిలదీశారు.
ఈ సెక్షన్ ప్రకారం.. ప్రభుత్వ విభాగాలు తమ సమాచారాన్ని, తీసుకునే నిర్ణయాలను ప్రజలకు ముందస్తుగానే స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుంది. “నేను మీ అభిమానిని కాబట్టే ఈ ప్రశ్నలు అడుగుతున్నాను, మా ప్రశ్నలకు మీరు నిరంతరం సమాధానం చెప్పాల్సి ఉంటుంది” అని రాహుల్ పేర్కొన్నారు.
Read also-వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ క్రేజీ అప్డేట్.. జూన్లో గ్లింప్స్, ఆగస్టులో థియేటర్లలోకి!
ఈ ట్వీట్లపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు రావడంతో రాహుల్ రామకృష్ణ మరోసారి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడిగినంత మాత్రాన ఎవరూ దేశద్రోహి కారని, ఒక పౌరుడిగా తనకు ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
వివాదానికి నేపథ్యం
ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జనసేన పార్టీ సభకు అనుమతి నిరాకరించడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “తెలంగాణ మీ అయ్య జాగీరా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన నటుడు రాహుల్ రామకృష్ణ.. పవన్ కళ్యాణ్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల లోపాలను, చట్టాల అమలును ఎండగడుతూ ఈ ట్వీట్లు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన శ్రేణులు ఈ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, పారదర్శకతను కోరడంలో తప్పులేదని మరికొందరు రాహుల్కు మద్దతుగా నిలుస్తున్నారు.
@PawanKalyan please ask and show for results for the implementation of PESA, 1/70 Act, Grama Sabha Act. The afforestation programs, did you do them? numbers seem dubious as verified by an independent body
I’m asking for filed and marked resultsJai Telangana!
— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026