Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలను ఆలపించి కోట్లాదిమంది అభిమానుల హృదయాలను దోచుకున్న ఎంతోమంది గొప్ప గాయని గాయకులలో లెజెండరీ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు ఒకరు. గాన కోకిల, భారత రత్న వంటి పురస్కారాలను అందుకున్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా జాతీయస్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇప్పటికే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subbalakshmi) బయోపిక్ సినిమాకు సంబంధించి పూర్తి కథను సిద్ధం చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సినీ వర్గాలు తెలియచేస్తున్నాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బయోపిక్ సినిమా విషయంలో ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇలా సాయి పల్లవితో పాటు రష్మిక వంటి తదితర హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ బయోపిక్ సినిమాలో మాత్రం రష్మిక మందన్న (Rashmika Mandanna) ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే ఈ బయోపిక్ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తి అయిందని, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో రష్మిక లుక్ చూసి మేకర్స్ ఇంప్రెస్ కావడంతో ఈమెను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం.
ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బయోపిక్ సినిమాలో రష్మికను ఎంపిక చేశారనే విషయం తెలిసిన ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రష్మిక సినీ కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న రణబాలి, మైసా వంటి పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
Also Read: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!