Sridevi: ప్రస్తుత కాలంలో చాలా మంది సెలబ్రిటీలు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు సినిమాల మీద ఆసక్తితో రీ ఎంట్రీ ఇస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijay Kumar) కూడా ఒకరు. 1992లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ‘రిక్షా మామ’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో నటిస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ..
1997లో ‘రుక్మిణి’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించి.. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో మరొకసారి తన నటనను ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తొలి హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. 2011లో సెల్ఫోన్, వీర అనే చిత్రాలలో చివరిగా నటించిన ఈమె.. పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయింది. ఒక పాప పుట్టిన తర్వాత పాప ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైన శ్రీదేవి విజయ్ కుమార్.. ఇప్పుడు నారా రోహిత్ (Nara Rohit) హీరోగా వస్తున్న ‘సుందరకాండ’ సినిమా ద్వారా హీరోయిన్ గా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శ్రీదేవి.. పలు విషయాలను పంచుకుంది.
ఆ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు – శ్రీదేవి
శ్రీదేవి మాట్లాడుతూ.. “నేను హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. నిజానికి నా నిర్ణయం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముందు నుంచే మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ అప్పటికి సంబంధం కుదరడంతో వివాహం చేశారు. మా కుటుంబంలో ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అనిపించకపోయినా.. అభిమానులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తర్వాత పాప పుట్టడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాను. అయితే మధ్యలో కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల తెరకు దూరమయ్యాను అనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు నన్ను నేను హీరోయిన్గా తెరపై చూసుకోబోతుండడం చూసి చాలా ఆసక్తి కలుగుతోంది”. అంటూ తెలిపింది శ్రీదేవి.
వినూత్నమైన కథతో సుందరకాండ..
ఇకపోతే సుందరాకాండ సినిమా విషయాలను ఆమె పంచుకుంటూ..” ఈ సినిమా ఒక వినూత్నమైన కథతో రూపొందుతోంది. ఆధ్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం కూడా ఈ సినిమా ద్వారానే వచ్చింది . ఇదొక అద్భుతమైన మరుపురాని జ్ఞాపకం. ఆ స్కూల్ డ్రెస్ లో మా పాపతో కలిసి ఫోటోలు దిగి దాచుకున్నాను కూడా.. ఆ స్కూల్ ఎపిసోడ్ కోసం నేను మరింత కష్టపడ్డాను ” అంటూ తెలిపింది శ్రీదేవి. ప్రస్తుతం శ్రీదేవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:DCM Pawan Kalyan : అధికార దుర్వినియోగం… పవన్ కళ్యాణ్పై హై కోర్టులో పిటిషన్