Trishala Dutt: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మల కుమార్తె త్రిషాల దత్.. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలు, వేధింపులు, బరువు సమస్యలపై ఇటీవల ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం న్యూయార్క్లో లైసెన్స్డ్ సైకోథెరపిస్ట్గా విజయవంతంగా రాణిస్తున్న ఆమె, ఒక సెలబ్రిటీ కూతురిగా సమాజం మీడియా నుండి ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
త్రిషాల న్యూయార్క్లో తన తాతయ్య, అమ్మమ్మల సంరక్షణలో పెరిగారు. కేవలం ఐదు లేదా ఆరేళ్ల చిన్న వయసు నుంచే ఆమె చుట్టుపక్కల తోటి పిల్లల నుండి ఎగతాళిని, మానసిక వేధింపులను ఎదుర్కొన్నారు. తాను ఒక ‘భారతీయురాలు’ కావడమే అందుకు ప్రధాన కారణమని ఆమె ఆవేదనతో తెలిపారు. ఆ చిన్న వయసులో తన మనసులోని బాధను, ఆవేదనను పంచుకోవడానికి ఎలాంటి సురక్షితమైన స్థలం లేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆమె జీవితంలో అతిపెద్ద ఘోరం 1996లో జరిగింది. త్రిషాలాకు కేవలం ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి రిచా శర్మ బ్రెయిన్ క్యాన్సర్తో మరణించారు. ఆ కష్టకాలంలో తండ్రి సంజయ్ దత్ తన సినిమా షూటింగుల కారణంగా ఇండియా, అమెరికాల మధ్య నిరంతరం ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. తల్లి దూరం కావడం, తండ్రి పక్కన లేకపోవడంతో త్రిషాల తీవ్రమైన ఒంటరితనంలో కూరుకుపోయారు. ఆ మానసిక వేదనను మరియు ఖాళీతనాన్ని మర్చిపోవడానికి ఆమె ఎక్కువగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. దీనివల్ల ఆమె విపరీతంగా బరువు పెరిగారు. మిడిల్ స్కూల్ నాటికి ఈ బరువు సమస్య ఆమెను మరింతగా కుంగదీసింది.
ఆమె హైస్కూల్కి వచ్చేసరికి, ఒక స్టార్ హీరో కుమార్తె అనే విషయం అందరికీ తెలిసింది. దాంతో ఆమెపై సమాజం చూసే కోణం పూర్తిగా మారిపోయింది. “సెలబ్రిటీ కూతురు అంటే ఒక ప్రత్యేకమైన గ్లామరస్ లుక్తో, ఎంతో అందంగా ఉండాలని జనాలు ఊహిస్తారు. కానీ నేను వారి అంచనాలకు తగ్గట్టుగా, సంజయ్ దత్ కూతురిలా కనిపించలేదు” అని త్రిషాల అన్నారు. దీనివల్ల ఆమె మరింత బాడీ షేమింగ్కు, విమర్శలకు గురయ్యారు. చిన్నప్పుడు ఇండియాకు వచ్చిన ప్రతిసారీ మీడియా ఫోకస్ ఆమెపై ఎక్కువగా ఉండేది. ఆ వయసులోనే ఆమె రూపం గురించి పత్రికల్లో రకరకాలుగా రాయడం, సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు పెట్టడం ఆమెను తీవ్రంగా గాయపరిచాయి.
అయితే, చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు, విమర్శలు చూడటం వల్ల తన మనసు ఎంతో దృఢంగా మారిందని ఇప్పుడు తనను ఏ విమర్శలు కూడా బాధించలేవని ఆమె చెప్పారు. తాను స్వయంగా ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల వల్లే.. ఇతరుల మానసిక సమస్యలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను థెరపిస్ట్గా మారానని త్రిషాల స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌత్ ఏషియన్ సమాజంలో ఉండే అలిఖిత ఒత్తిళ్లపై పోరాడటమే తన లక్ష్యమని ఆమె వివరించారు.