Judicial Custody for Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేటితో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరికొన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేజ్రీవాల్ కు 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 15 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. ఆయన్ను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు.
Also Read : మధ్యంతర బెయిల్ కోసం.. కోర్టులో విచారణ, ఈసారి?
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రైన అరవింద్ కేజ్రీవాల్ ను ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ మార్చి 21న అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా మార్చి 28 వరకూ తొలిసారి ఈడీ కస్టడీకి ఇచ్చింది. మార్చి 28న మరోసారి కోర్టులో హాజరు పరిచి ఈడీ కస్టడీ పొడిగించాలని కోరగా.. ఏప్రిల్ 1 వరకూ కస్టడీని పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా.. 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించనున్నారు. కోర్టు లోపలికి వెళ్లే ముందు మాట్లాడిన కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్రమోదీ కావాలని చేస్తున్న ఈ చర్యలు దేశానికి మంచిది కాదన్నారు.
ఇదే కేసులో అరెస్టైన కవిత కూడా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు ఏప్రిల్ 9 వరకూ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. గతంలో సుప్రీంకోర్టును బెయిల్ కోసం ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. నేడు బెయిల్ పిటిషన్ విచారణలోనైనా కవితకు ఊరట దక్కుతుందో లేదో చూడాలి.