Haryana : యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ 500 మంది విద్యార్థినులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్కు లేఖ రాశారు. హర్యానాలోని చౌదరి దేవీలాల్ యూనివర్సిటీ విద్యార్థినులు తమను వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ను సస్పెండ్ చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో వారు డిమాండ్ చేశారు.
వైస్ ఛాన్స్లర్ డాక్టర్ అజ్మేర్సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, మీడియా సంస్థలకు లేఖ కాపీని పంపారు.
ప్రొఫెసర్ తన ఛాంబర్లోకి అమ్మాయిలను పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ప్రైవేటు భాగాలను తాకుతున్నాడని ఆ లేఖలో విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని వాపోయారు. కొన్ని నెలలుగా ఆయన ఇలా ప్రవర్తిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. కొంతమంది విద్యార్థుల నుంచి వివరాలు కూడా తీసుకున్నామని ఏడీజీ శ్రీకాంత్ జాదవ్ తెలిపారు. ప్రత్యేక బృందం ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి వాంగ్మూలాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రొఫెసర్పై విద్యార్థినుల వేధింపులు అవాస్తవమని తమ దర్యాప్తులో తేలినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ప్రొఫెసర్ కూడా ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.