Tollywood Heroine Rachana Banerjee Contesting Elections 2024: తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ రచనా బెనర్జీ అంటే బహుశా గుర్తుపట్టనివారుండరు. ఆకర్షనీయమైన ముఖం, అందమైన చిరునవ్వు, సినిమాల్లో మంచి నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, చక్రవర్తితో కలిసి పలు సినిమాల్లో నటించింది రచనా బెనర్జీ. అయితే, ఇప్పుడామె రాజకీయంలోకి అడుగుపెట్టారు. ఎంపీగా కూడా ఆమె పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసు అని, అయితే తనను తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలని మమతా బెనర్జీ అడిగినప్పుడు తాను కొద్దిగా ఆలోచించి.. చివరకు ఓకే చెప్పానని రచనా బెనర్జీ చెప్పారు. అయితే, హుగ్లీ లోక్ సభ అభ్యర్థిగా తనను మమతా బెనర్జీ ప్రకటించినప్పుడు తాను ఆనందంతో పొంగిపోయానని, తన తల్లి కూడా ఎంతో సంతోషించిందని ఆమె చెప్పింది. అయితే, జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశాలు వస్తాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటూ పేర్కొన్నది. లైవ్ స్టేజ్ షోల కోసం గతంలో హుగ్లీ వెళ్లాను.. ఇక నుంచి హుగ్లీ తన అడ్డా అంటూ ఆమె పేర్కొన్నారు. హుగ్లీలో నాయకురాలిగా రాణించి మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెడుతానంటూ ఆమె పేర్కొన్నారు.
Also Read: ఓటమి భయంతోనే రాయ్ బరేలీ నుంచి రాహుల్ పోటీ: స్మృతి ఇరానీ
అయితే, సినిమాలకు గుడ్ బై చెప్పినంక కొద్ది రోజులకు రచనా బెనర్జీ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే, వాటిని ఆమె కొట్టిపడేశారు. సీఎం మమతా బెనర్జీ వద్ద రచనా బెనర్జీకి మంచి గుర్తింపు ఉంది. అయితే, హుగ్లీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ బరిలో ఉన్నారు. లాకెట్ కూడా నటీ కావడంతో ఎలాగైనా ఈసారి హుగ్లీలో గెలవాలని రచనాను మమత బెనర్జీ బరిలోకి దింపారనేది టాక్.