Amul vs Nandini: కర్ణాటకలో అమూల్ పాల వివాదం… సద్దుమణగక ముందే….ఇప్పుడు కేరళలో మరో వివాదం మొదలైంది. నందిని సంస్థ ఔట్లేట్లను తెరవడంపై మలయాళీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు రెండు రాష్ట్రాల మధ్య పాల గొడవ ఏంటి?
కర్ణాటకలో అమూల్ పాల విక్రయం రాజకీయ వేడెక్కించింది. రాష్ట్రంలో అమూల్ పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించింది. ఇందుకు ప్లాన్ చేయడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టింది. అమూల్ పాల ఉత్పత్తులను రానిచ్చే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతోపాటు అనేక కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్కు చెందిన అమూల్కు కట్టబెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది.
అయితే నందిని బ్రాండ్కు పోటీగా అమూల్ సంస్థను కర్ణాటకలో విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. ఇదే నందిని సంస్థ తమ రాష్ట్రంలో స్టోర్లు తెరవడంపై కేరళకు చెందిన పాల సహకార సంస్థ మిల్మా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ రాష్ట్ర పరిధులు దాటి అమ్మకాలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తోంది. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధమని అంటోంది.
కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మిల్మా పేరిట కేరళ పాల ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయ్. నందిని పేరిట పాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే కర్ణాటక మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కేరళలో పలు చోట్ల ఔట్లెట్లు తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లక్షలాది మంది పాడి రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సహకార వ్యవస్థకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆరోపించింది మిల్మా సంస్థ. కొన్ని రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధులను దాటి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయని ఇది సమాఖ్య, సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కర్ణాటకలో అమూల్ తన ఉత్పత్తులను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నందిని బ్రాండ్ను ప్రమోట్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిస్తున్నారు కేరళ ప్రజలు. ఈ ధోరణి రాష్ట్రాల మధ్య అనారోగ్య పోటీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల పరిధి దాటి వేరే రాష్ట్రాల్లో పాల ఉత్పత్తులు విక్రయించకూడదన్న ఒప్పందం పాల సహకార సంఘాల మధ్య ఉందని గుర్తు చేస్తున్నారు.