Delhi: ఆపరేషన్ సిందూర్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. జరుగుతున్న ఆపరేషన్కు సంబంధించి వివరాలు ఇవ్వలేమని తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు.
భేటీలో ఏం జరిగింది?
ఆపరేషన్ సిందూర్పై ఢిల్లీ గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ గురించి వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించామన్నారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. అయితే ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం లేదన్నారు. భారత్ మరిన్ని దాడులు చేయాల్సిన అవసరం లేదన్నారు. పాక్ దళాలు దాడి చేస్తే ఎదురుదాడి తప్పదని చెప్పకనే చెప్పేశారు.
ఆ సమావేశంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ను అన్ని పార్టీలు సమర్థించాయని అన్నారు. ఈ విషయంలో కేంద్రానికి అండగా నిలిచాయన్నారు. పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పుకొచ్చారు.
ALSO READ: ఇండియాను తెగ పొగిడేస్తున్న పాకిస్తాన్ వ్యక్తి
సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, భేటీలో కేంద్రమంత్రులు చెప్పినది విన్నామన్నారు. కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని వారు చెప్పారని వివరించారు. అందరం ప్రభుత్వంతో ఉన్నామని చెప్పారు.
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దానికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. తొమ్మిది చోట్ల జరిపిన ఈ దాడుల్లో కీలకమైన ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో కీలక నేతలు హతమైనట్లు తొలుత వార్తలు వచ్చాయి.
తొలుత 30 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుధవారం సాయంత్రానికి 70 మందికి చేరింది. తాజాగా రక్షణ మంత్రి ఆల్ పార్టీ సమావేశంలో దాదాపు 100 మంది వరకు మరణించి ఉంటారని చెప్పుకొచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండోసారి అఖిలపక్ష భేటీ జరిగింది. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. విపక్ష పార్టీల నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు మిగతా పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాని చెప్పిన సందేశాన్ని మంత్రులు పార్టీలకు వివరించారు.