Badrinath Donations: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ.. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ లోనూ అలాంటి ఆరోపణలే వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల దారి మళ్లింపుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆలయ విరాళాలను అక్కడ కూడా దారి మళ్లిస్తున్నట్లు పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC).. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
బద్రీనాథ్ ధామ్లో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన ‘భైరవ్ సేన’ అనే స్థానిక సంస్థ.. ఆలయ నిధుల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా టెంపుల్ కమిటీ ఛైర్మన్కు వ్యక్తిగత సహాయకుడిగా (PA) వ్యవహరిస్తున్న ఒక ఉద్యోగికి ఈ అక్రమాలతో సంబంధం ఉందంటూ ఆ సంస్థ సైతం ఆరోపణలు గుప్పించింది.
ఈ వివాదంపై బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) అధ్యక్షుడు హేమంత్ ద్వివేది స్పందించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన ‘వ్యక్తిగత కార్యదర్శి’ కాదని ఆయన స్పష్టం చేశారు. సదరు వ్యక్తి BKTCలో పనిచేసే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొన్నారు. గతంలో ముగ్గురు మాజీ ఛైర్మన్ల వద్ద కూడా ఆయన పీఏగా సేవలు అందించారని ద్వివేది స్పష్టత ఇచ్చారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తప్పు చేసినట్లు తేలితే ఎంతటి వారైనా సరే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సోహన్ సింగ్ రంగద్ సైతం దీనిపై స్పందించారు. ఆరోపణలు రాగానే బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని తాము నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు. అయితే అందుబాటులో ఉన్న ఫుటేజీలో ఎలాంటి అనుమానస్పద కార్యకలాపాలను తాము గుర్తించలేదన్నారు. అయినప్పటికీ భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే అనుమానిత ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు సీఈఓ స్పష్టం చేశారు.
Also Read: ఉక్కు పరిశ్రమ జగన్ పుణ్యమే.. చంద్రబాబుది ‘క్రెడిట్ డ్రామా’.. ఎంపీ అవినాష్ ఫైర్
దర్యాప్తు కమిటీ ఏర్పాటైన వెంటనే సమగ్ర విచారణ ప్రారంభమవుతుందని సీఈఓ రంగద్ హామీ ఇచ్చారు. నివేదికలో ఏమైనా అక్రమాలు జరిగినట్లు తేలితే.. శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ యాక్ట్-1939, ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అటు శాఖాపరమైన, చట్టపరమైన తప్పకుండా ఉంటాయని తెలియజేశారు. అయితే దేశంలోని కోట్లాది భక్తుల నమ్మకాలతో కూడుకున్న సున్నితమైన అంశం కాబట్టి.. దీనిపై ఎలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని సీఈఓ విజ్ఞప్తి చేశారు.
Also Read: సిక్ లీవ్స్పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!