Bihar CM Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎవరితోపడితే వారితో చేతులు కలిపి తరుచూ సెన్సేషనల్గా మారుతుంటారు. ఆయన నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయి. అలాంటి సీఎం నితీశ్ కుమార్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగి కాళ్లు మొక్కడానికి సిద్ధపడ్డారు. దయచేసి రోడ్డు నిర్మాణం వేగంగా పూర్తి చేయండని విజ్ఞప్తి చేసి.. అందుకోసం అవసరమైతే మీ కాళ్లు మొక్కుతా అని ముందుకు వెళ్లారు. దీంతో ఆ ఉద్యోగి హడలెత్తిపోయి.. వద్దు సార్, అలా చేయకండి అంటూ చేతులు జోడించి ప్రార్థించాడు. ఈ ఘటన పాట్నాలో ఓ కార్యక్రమంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి గంగా నదికి సమాంతరంగా నిర్మిస్తున్న జేపీ గంగా పథ్ ఎక్స్ప్రెస్ను ప్రజలకు అంకితం చేసే కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్ బుధవారం హాజరయ్యారు. అక్కడ పూర్తయిన రోడ్డు నిర్మాణం గురించి చర్చించారు. అయితే, నితీశ్ కుమార్ మాత్రం జరిగిన పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పని చేస్తే మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రశ్నించారు. దయచేసి రోడ్డు నిర్మాణ పని వేగవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది చివరికల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘మీరు అడగండి.. నేను మీ కాళ్లు పట్టుకుంటా. ఈ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయండి’ అంటూ స్టేజీ పై కుర్చీ నుంచి లేచి నిర్మాణ సంస్థ ఉద్యోగి వద్దకు వెళ్లారు.
ఇటీవల ఓ ఉన్నత ఐఏఎస్ అధికారి కాళ్లు పట్టుకోవడానికీ సీఎం నితీశ్ కుమార్ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఓ భూ వివాదాన్ని వెంటనే సెటిల్ చేయాలని, అవసరమైనన్ని సర్వేలు చేపట్టాలని నితీశ్ కుమార్ కోరారు. భూ వివాదాలు పెండింగ్లో ఉండటం వల్లే అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. కాబట్టి, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని గతవారం కోరారు. అవసరమైతే కాళ్లు మొక్కుతానన్నారు.
Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK
— IANS (@ians_india) July 10, 2024
జేపీ గంగా పథ్ ఫంక్షన్ అక్కడితో ఆగిపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫంక్షన్ గురించి రచ్చ జరిగింది. ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. సీఎం నితీశ్ కుమార్ వీడియో చూసి ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీశ్ కుమార్ చేతిలో అసలు ఎలాంటి పవర్ లేదని, వట్టి నిస్సహాయుడని విమర్శించారు. ప్రభుత్వ అధికారులైనా, ప్రైవేటు ఉద్యోగులైనా ఆయన వారి కాళ్లు మొక్కడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని చురకలంటించారు.