BSP President Mayawati: తన రాజకీయ వారుసుడిగా, జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయనపై మాయవతి వేటు వేశారు. అతనికి పూర్తి పరిపక్వత వచ్చేవరకు ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆమె మంగళవారం ప్రకటించారు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటుగా ఉద్యమం కోసం బీఎస్పీ నాయకత్వం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడబోదంటూ ఆమె పేర్కొన్నారు. బీఎస్పీ అంటే పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక.. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉద్యమం అంటూ ఆమె పేర్కొన్నారు. తన సోదరుడు, ఆకాశ్ తండ్రి ఆనంద్ కుమార్ ఇంతకుముందు మాదిరిగానే ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ ఆనంద్ పదవీ బాధ్యతలను స్వీకరించిన ఐదు నెలల్లోనే పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
అయితే, బహిరంగ సభలలో ఆకాశ్ ఆనంద్ పాల్గొని ప్రసంగించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయని, ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడిందంటూ చర్చించుకుంటున్నారు. అయితే, ఇటీవల సీతాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కూడా ఆకాశ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసినట్లు సమాచారం.
Also Read: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
అయితే, బహిరంగ సభలు, రాజకీయ సమావేశాలు, ర్యాలీలలో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలంటూ ఆకాశ్ ను గత నెలలోనే మాయావతి హెచ్చరించారని, అయినా ఆతను పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే ఆయనపై మాయావతి వేటు వేశారంటూ చర్చ కొనసాగుతోంది.