Candidates Against PM Modi, Rahul Gandhi: రాబోయే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీ అధినేతలపై తలపడబోయే వ్యక్తుల విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చక్కర్లు కొడుతున్నాయి. దేశ ప్రముఖ రాజకీయ నాయకులైన ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ నాయకలు రాహుల్ గాంధీలకు ప్రత్యర్థులుగా నిలుస్తున్న అభ్యర్థులెవరనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. వారణాసి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా అజయ్ రాయ్ను ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. ఆయన వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోడీపై పోటీ చేశారు. రెండు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు.
ప్రధాని మోడీపై వరుసగా మూడోసారి పోటీకి తలపడే అజయ్ రాయ్ బీజేపీ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉండడం గమనించదగ్గ విషయం. 1996 నుంచి 2007 వరకు బీజేపీ టికెట్పై వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో పార్టీ నుంచి లోక్సభ టిక్కెట్ రాకపోవడంతో సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2009లో ఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి ఓటమి చెందారు. 2009లోనే పింద్రా ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత 2012లో కాంగ్రెస్లో చేరి పింద్రా స్థానం నుంచి గెలుపొందారు. ఇక అజయ్ రాయ్పై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్యాంగ్స్టర్ కేసులు కూడా ఉన్నాయి. 2015లో NSA కింద అరెస్టయ్యాడు. 2021లో ఈ క్రిమినల్ కేసుల కారణంగా ఆయన నాలుగు ఆయుధాల లైసెన్స్లను సస్పెండ్ చేశారు కూడా. ఇదీ క్లుప్తంగా అజయ్ రాయ్ నేపథ్యం.
ఇక కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి పోటీగా నిలిచే వ్యక్తి గురించి పరిశీలిస్తే.. ఇటీవలే బీజేపీ ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో కోజికోడ్కు చెందిన కే సురేంద్రన్ పేరు ఉంది. ఈయన కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై ప్రత్యర్థిగా పోటీలో నిలవనున్నారు. ఇక కాంగ్రెస్ కంచుకోటగా పిల్చుకునే వయనాడ్లో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే ఈసారి రాహుల్ను ఢీకొట్టడానికి బీజేపీ సురేంద్రన్ను బరిలోకి దింపింది. సురేంద్రన్ RSS విద్యార్థి విభాగం అయిన ABVP నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. సురేంద్రన్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పతనంతిట్ట నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
Also Read: కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల.. ప్రధాని మోదీపై పోటీ చేసేది ఇతనే..
2016లో అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కే సురేంద్రన్ కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఈయన 2018లో శబరిమల ఆందోళన సమయంలో నెలరోజుల పాటు జైలులో గడిపారు.
2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లోనూ, ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయిన సురేంద్రన్.. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా పోటీలో నిలవనున్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కీలక నాయకులపై పోటీదారులుగా నిలిచే అభ్యర్థుల నేపథ్యం ఇదీ.. అయితే.. ఇక్కడో ఆశ్చర్యకరమైన పాయింట్ దాగిఉంది.. అదేంటంటే, ప్రధాని మోడీపై, కాంగ్రెస్ నేత రాహుల్పై పోటీకి దిగే ఇద్దరు అభ్యర్థులదీ బీజేపీ డీఎన్ఏనే కావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. వారి జయాపజయాల అవకాశాలు ఎలాఉన్నా.. ప్రముఖ నాయకులను ఢీకొట్టడానికి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలవడంతో వారు జాతీయ స్థాయి వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు.