Instagram: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి ప్లాట్ఫామ్లలో యూజర్ల భద్రతను గాలికొదిలేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల భద్రత, సైబర్ మోసాల నేపథ్యంలో కేవలం ఒకే వారంలో మెటా సంస్థకు కేంద్రం వరుసగా రెండుసార్లు హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇన్స్టాగ్రామ్లో వివాదాస్పద ప్రకటనలు
ఇన్స్టాగ్రామ్ వేదికగా చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని ప్రకటనలు, అలాగే సైబర్ నేరగాళ్లకు అండగా నిలుస్తున్న మరికొన్ని ప్రమోషన్లపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ తరహా వివాదాస్పద ప్రకటనలు అసలు ప్లాట్ఫామ్పైకి ఎలా వచ్చాయో చెప్పాలని, దీనిపై తక్షణమే పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ తాజాగా ఇన్స్టాగ్రామ్కు నోటీసులు పంపింది. ఆన్లైన్ వేదికగా పిల్లల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.
వాట్సప్ ‘యూజర్నేమ్’ ఫీచర్పై అభ్యంతరాలు
దీనికి ముందే.. బుధవారం రోజున వాట్సప్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు మరో నోటీసు ఇచ్చింది. వాట్సప్లో త్వరలో తీసుకురాబోతున్న ‘యూజర్నేమ్’ (Username) ఫీచర్పై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఫోన్ నంబర్ అవసరం లేకుండా కేవలం ఒక నకిలీ ఐడీతో ఎవరినైనా కాంటాక్ట్ చేయవచ్చు. దీనివల్ల ఆన్లైన్ మోసాలు, ముఖ్యంగా దేశంలో కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్లు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నకిలీ గుర్తింపులతో ప్రజలను బురిడీ కొట్టించే అవకాశం ఉన్నందున, దీనిపై మూడు రోజుల్లోగా సమగ్ర సమాధానం ఇవ్వాలని డెడ్లైన్ విధించింది. యాప్ ఫీచర్ల కంటే దేశ పౌరుల డిజిటల్ భద్రతే తమకు ముఖ్యమని కేంద్రం ఈ నోటీసుల ద్వారా మెటా సంస్థకు గట్టి సందేశం పంపింది. దీనిపై మెటా యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!