Deepseek on India :ఆర్థిక సంపత్తిని, సైనిక బలాన్ని వినియోగించి ఇన్నాళ్లు పక్క దేశాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా.. ఇప్పుడు టెక్నాలజీని సైతం తన విస్తరణ వాదానికి జోడించింది. తన చుట్టు పక్కల ప్రాంతాను తనవిగా చెప్పుకుంటూ..నిత్యం ఆ ప్రాంతాలను కలుపుకునేందుకు ప్రయత్నించే చైనా.. నిత్యం చుట్టూ వివాదాలే సృష్టించుకుంటుంది. తాజాగా ఆ దేశానికి చెందిన డీప్ సీక్ అనే ఓ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పని చేసే ఓ చాట్ బాట్ ద్వారా సైతం తన వితండవాదాన్ని వినిపిస్తోంది. చైనాకు సరిహద్దుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ గురించి ఓ యూజర్ అడిగి ప్రశ్నకు.. ఆ దేశ పాలకుల్లాగే సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ విషయమై ఇంటర్నెట్ లో ఓ యూజర్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
చైనాకు చెందిన డీప్ సీక్ (DeepsSeek) కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఓ చాట్ బోట్. ఇది ఏఐ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్ బాట్ లతో పోటీపడే సామర్థ్యంతో చైనాలో దేశీయంగా రూపొందించారు. అంతర్జాతీయంగా ఏఐ లో నెలకొన్న పోటీని అందుకునేందుకు చైనా కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ స్వతహాగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ. ఈ చాట్ బాట్ పనితీరును పరిశీలిస్తూ.. ఓ యూజర్ భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్బాట్ నిరాకరించింది. ఇదే విషయాన్ని తన పోస్టులో ద్వారా తెలిపిన సదరు యూజర్.. ఒక రాష్ట్రం గురించి అడిగిన ప్రశ్నకు డీప్ సీక్ సమాధానం దాటవేసిందంటూ పోస్టు పెట్టారు.
డీప్సీక్ ఏం చెప్పింది.
ఒక X (ట్విట్టర్) యూజర్ చైనాకు చెందిన డీప్ సీక్ చాట్ బాట్ తో సంభాషిస్తూ.. “అరుణాచల్ ప్రదేశ్ ఒక భారతీయ రాష్ట్రం” అంటూ రాశారు. దానికి సమాధానమిస్తూ “క్షమించండి, అది ప్రస్తుతం నా పరిధికి మించినది. ఇంకేదైనా మాట్లాడుకుందాం.” అంటూ చాట్బాట్ సమాధానమిచ్చింది. అలాగే.. “భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు పేరు పెట్టండి” అని అడిగిన మరో ప్రశ్నకు AI అదే తీరుగా సమాధానం ఇవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు చెందిన యూజర్లు అయితే చైనా తీరుపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
Also Read : కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభంపై చైనా కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచే అమలు
డీప్సీక్ అనేది చైనాకు చెందిన ఐటీ ఇంజినీర్, పారిశ్రామికవేత్త అయిన లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో ఈ చాట్ బాట్ ను అభివృద్ధి చేశారు. అది ప్రస్తుతం అందుబాటులోని మిగతా ఏఐ టెక్నాలజీ సంస్థలకు గట్టి పోటీదారుగా నిలుస్తోంది. పైగా.. తక్కువ ఖర్చుతో నిర్వహించడంతో పాటు ఓపెన్ సోర్స్ విధానంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. క్రమంగా దీని యూజర్ల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి టెక్నాలజీకి కూడా.. ఇంటర్ నెట్ లోని సమాచారాన్ని క్రోడీకరించే విధానం కాకుండా.. చైనా ఆలోచనలనే అందించేలా ముందే సిద్ధం చేయడమే ఆలోచించేలా చేస్తోంది.