CM Revanth on Modi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం వేడెక్కింది. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం తీవ్రతరం చేశారు. లేటెస్ట్ గా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలంటూ మహారాష్ట్ర ఓటర్లకు పిలుపు నిచ్చారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లారు సీఎం రేవంత్రెడ్డి. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. దేశంలోని మహారాష్ట్రలో ఎక్కువ మంది రైతు ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పూర్తిగా మరిచారన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలు వల్ల అదానీ, అంబానీలకు మేలు చేయాలని ప్రధాని మోదీ భావించారని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని చెబుతూనే, దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు ఈ గడ్డ జన్మనిచ్చిందన్నారు.
మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారని వివరించారు. ఇంతటి ఘనతున్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్కు తరలించుకుపోయారని ఆరోపించారు.
ALSO READ: సికింద్రాబాద్ షాలిమార్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు..పరిస్థితి ఎలా ఉందంటే?
మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్రెడ్డి. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తామే నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలవుతున్న ఆరు గ్యారంటీలపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు.
తెలంగాణలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామన్నారు సీఎం రేవంత్రెడ్డి. అన్నట్లుగానే 25 రోజుల్లో 22 లక్షల 22 వేల 067 మంది రైతులకు రూ.17,869 కోట్ల రూపాయలు మాఫీ చేసి చూపించామన్నారు. ఈ విషయంలో ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తామే సిద్ధంగా ఉన్నామన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై తొలుత ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, ఆ తర్వాత దాన్ని తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ సీఎం. ప్రభుత్వం ఏర్పడిన కేవల 10 నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మీ పథకం కింద రూ.500 లకే గ్యాస్ సిలండర్ అందిస్తున్నామని గుర్తు చేశారు.
50 లక్షల మంది.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందించాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించు కున్నారు. ఇందుకోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3541 కోట్ల రూపాయలను అందజేసిందన్నారు.
సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. వచ్చే ఏడాదిలో జరగనున్న జనగణనలో తెలంగాణ కుల గణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్లో తీర్మానం చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.