CM Stalin Advocate Bill Tamil Nadu | ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ముసాయిదాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తాజాగా మరో అంశంపై కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన అడ్వకేట్ బిల్లుపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రం ప్రవేశపెట్టే అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై, న్యాయవ్యవస్థపై దాడి అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో స్టాలిన్ ట్విటర్లో ఒక పోస్ట్ను షేర్ చేస్తూ.. “కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, పుదుచ్చేరీ బార్ కౌన్సిల్ను మద్రాస్ బార్ కౌన్సిల్గా మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలోనే గతంలో ఎన్జేఏసీని (National Judicial Appointments Commission- జాతీయ న్యాయ నియామకాల కమిషన్) తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు.
Also Read: భారత్ పై ట్రంప్ పన్నుల భారం – ఇక ఈ వస్తువులపై భారీగా పన్నులు చెల్లించాలి
అయితే, ఈ బిల్లుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం దానిని వెనక్కి తీసుకుంది. ముసాయిదాలో సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామని ప్రకటించింది. గతంలో మోదీ ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా సుప్రీం కోర్టు కొలీజియం అవసరం లేకుండానే నేరుగా న్యాయమూర్తుల నియామకం చేపట్టాలని భావించింది. కానీ ఈ చట్టం రాజ్యంగానికి వ్యతిరేకమని పేర్కొంటూ సుప్రీం కోర్టు 2015లో రద్దు చేసింది.
ఎన్ఈపీ అమలు ప్రసక్తే లేదు.. రూ.2 వేల కోట్లు కాదు రూ.10 వేల కోట్లు ఇచ్చినా చేయను : స్టాలిన్
ఇంతకుముందు జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేయడానికి అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మంజూరు చేసినా దానిని అంగీకరించనని ఆయన తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు మరియు సామాజిక న్యాయవ్యవస్థపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉన్నాయని ఆయన వివరించారు. భారతీయ భాషల మధ్య విభేదాలు పెంచకూడదని ప్రధానమంత్రి మోదీ హితబోధ చేసిన సమయంలో, కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మేము ఏ భాషనూ వ్యతిరేకించడం లేదు. కేవలం హిందీ కోణంలోనే కాకుండా, ఎన్ఈపీపై వ్యతిరేకతకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. నీట్ వలెనే ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో ప్రవేశాలకు కూడా పరీక్షలు రాయాల్సి వస్తుంది. ఇది విద్యార్థులను చదువుల నుండి దూరం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడు అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటుంది. ఎన్ఈపీని అమలు చేస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని కేంద్రం చెబుతోంది. కానీ రూ.10 వేల కోట్లు ఇచ్చినా దీనిని అంగీకరించను. తమిళనాడును రెండు వేల ఏళ్లు వెనక్కి నెట్టే పనిని చేయను” అని స్టాలిన్ తెలిపారు.
ఎన్ఈపీ విషయంలో తమిళనాడు మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా దీన్ని అమలు చేయాలని స్టాలిన్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ఒక లేఖలో సూచించారు. అయితే, తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని, తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని స్టాలిన్ పునరుద్ఘాటించారు.
కుటుంబ నియంత్రణ వల్ల తమిళనాడు లోక్సభ సీట్లు తగ్గే పరిస్థితి
కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల రాష్ట్రంలో లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్లో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిమితంగా పిల్లలను కని సంపదతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని చేపట్టామన్నారు. దీని కారణంగా రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందన్నారు.