Telegram Ban: టెలిగ్రామ్ ప్లాట్ ఫామ్ కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాత్కాలికంగా టెలిగ్రామ్ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే విచారణలో టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు సర్క్యులేట్ అయినట్టుగా వెల్లడైంది. పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏ నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ ప్లాట్ ఫామ్ ను తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే దీనిని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన దిల్లీ హైకోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం దాంట్లో టెలిగ్రామ్ యాప్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఓ డార్క్ వెబ్ సైట్ లా మారిందని పేర్కొంది. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలతోపాటు అన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సైబర్ క్రిమినల్స్ కు టెలిగ్రామ్ ఓ వేదికగా మారిందని తెలిపింది.
కాగా శుక్రవారం దిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ తేజస్ కారియా టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ అక్రమ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి టెలిగ్రామ్ వేదికగా మారిందని చెప్పారు. అనుమానాస్పద ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు టెలిగ్రామ్ కు సూచించామన్నారు . అయినా తగిన చర్యలు తీసుకోవటంలో టెలిగ్రామ్ నిర్వాహకులు విఫలమైనట్టు చెప్పారు.
Also Read: ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!
అటు టెలిగ్రామ్ తరపున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపిస్తూ నిషేధం విధించటాన్ని కేంద్రం సమర్థించుకోజాలదని చెప్పారు. సంబంధిత కంటెంట్ ను మాత్రమే బ్లాక్ చేయకుండా మొత్తం యాప్ ను ఎందుకు నిషేధించారో వివరించలేదన్నారు. కేవలం నీట్ పరీక్షతో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుందా? అని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కేంద్రం వాదనలను సమర్థించింది. సెక్షన్ 69ఏ ప్రకారం ఓ డిజిటల్ వేదికను నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరుతూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఈనెల 22వ తేదీ వరకు టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధం కొనసాగనుంది.
Also Read: టెలిగ్రామ్పై కేంద్రం బ్యాన్.. ప్రత్యామ్నాయ 5 యాప్స్ ఇవే.. సేఫ్ అండ్ సూపర్!