Delhi Mayoral Polls postponed: ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఎందుకంటే ఆ స్థాయిలో పరిస్థితులు అప్పుడు చోటు చేసుకున్నాయి. అయితే, ఈరోజు ఎన్నికలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ, ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను ఈరోజు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల కోసం ప్రిసైడింగ్ అధికారిని నియమించకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించి గురువారం సక్సేనా తరఫున రాజ్ నివాస్ ఓ లేఖను కూడా విడుదల చేసింది. ఢిల్లీ మద్యం విధానంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారని, అయితే.. ముఖ్యమంత్రి అభిప్రాయం లేకుండా ప్రిసైడింగ్ అధికారిని నియమించరాదని.. అలా నియమించడం కూడా సరికాదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ ఎన్నికలను పౌర సంఘం వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: ప్రారంభమైన రెండో దశ ఎన్నికల పోలింగ్..
కాగా, మేయర్ ఎన్నికలు వాయిదా వేయడంతో ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే లెఫ్టినెంట్ గవర్నర్ వాయిదా వేశారని ఆరోపిస్తున్నారు. బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారని మండిపడుతున్నారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టై ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్న విషయం విధితమే.