Ex-Agniveers to get 10 % reservation in CISF, BSF: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్- బీఎస్ఎఫ్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో 10 శాతం మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపాయి. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపడుతామని పేర్కొన్నాయి. అయితే, అగ్నిపథ్ పథకం చర్చనీయాంశమైన వేళ సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ అధిపతులు ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మాజీ అగ్నివీరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని.. ఆ నిర్ణయం ప్రకారం సీఐఎస్ఎఫ్ కూడా మాజీ అగ్నివీరులను నియమించుకునేందుకు సిద్ధమవుతోందని సీఐఎస్ఎఫ్ జనరల్ నైనా సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో పది శాతం వారికి కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ వీరికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. మొదటి ఏడాది ఐదు సంవత్సరాలు, ఆ తదనంతరం మూడు సంవత్సరాల సడలింపు ఇస్తామని వెల్లడించారు.
అయితే, త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి 2022 జూన్ లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్ లుగా విధులు నిర్వహించేందుకు అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. నాలుగేళ్లు ముగిసిన తరువాత సర్వీస్ నుంచి తప్పుకొన్న అగ్నివీర్ లకు పెన్షన్ సౌకర్యాలు ఉండవని తెలిపింది. వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీసులో కొనసాగించనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: సారీ.. నేను ఇప్పుడు మాట్లాడలేను: ట్రైయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్
కాగా, ఈ పథకంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. మిగతా 75 శాతం పరిస్థితి ఏంటని ఇప్పటికీ ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కేంద్ర బలగాలు పేర్కొన్నాయి. తద్వారా శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరుతారని బీఎస్ఎఫ్ చీఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ అన్నారు. వారికోసం పది శాతం రిజర్వేషన్ ను కల్పించనున్నామని పేర్కొన్నారు.