Economical Changes : కొత్త ఏడాదిలో మొదటి నెల ముగిసిపోయింది. కొత్త నెల వచ్చేసింది.. దాంతో పాటే కొత్త బడ్జెట్ ను కూడా తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మారేది కేవలం తేది మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో అనేక మార్పులు కూడా వస్తుంటాయి. ఇవ్వన్నీ మన నెలవారీ బడ్జెట్ ను ప్రభావితం చేసేవే.. అంటే మన జేబులపై ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రభావితం చూపించబోతున్నాయి అన్నమాట. అంటే.. వంటగదిలోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర నుంచి యూపీఐ నిబంధనల వరకు అనేక మార్పులు రానున్నాయి. ఈ నెలలో రానున్న మార్పులేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..
1. ఎల్పీజీ ధరలు దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి తేదీన సవరిస్తుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ రోజు కావడంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గిస్తారా? లేదా పెంచుతారా? అన్నది తెలియాల్సి ఉంది. సిలిండర్ ధరల మార్పు సామాన్యుల జేబుపై ప్రభావం చూపే అంశం కావడంతో అంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఇదే వరుసలో.. ఈ ఏడాది జనవరి 1 న, చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ రేటును తగ్గించాయి.
2. UPIకి సంబంధించిన నియమాలు
యూపీఐకి సంబంధించిన రూల్స్లో మరోసారి పెద్ద మార్పు రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొత్త నియమాలు ఫిబ్రవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఇందులో భాగంగా.. ప్రత్యేక అక్షరాలతో చేసిన IDలతో లావాదేవీలు స్వీకరించేందుకు వీలవదని స్పష్టం చేసింది. NPCI ప్రకారం, ఫిబ్రవరి 1 నుంచి ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలు అంటే అక్షరాలు సంఖ్యలు కలయికగా మాత్రమే లావాదేవీ ID ఉపయోగించాలని సూచించింది. ఇది కాకుండా లావాదేవీ IDని రూపొందిస్తే చెల్లింపులు వీలుకాదని తెలిపింది.
3. ఖరీదైనవిగా మారనున్న మారుతి కార్లు
పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, నిర్వహణ వ్యయాలను భరించేందుకు మారుతీ సుజుకి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ ఏడాది ఫిబ్రవరి 01 నుంచి వివిధ మోడల్ కార్ల ధరలను రూ. 32,500 వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. Alto K10, S-Preso, Celerio, Wagon R, Swift, Dzire, Brezza, Ertiga, Eeco, Ignis, Baleno, Ciaz, XL6, Francox, Invicto, Jimny, Grand Vitara వంటి వాటి ధరలు పెరగనున్న మోడళ్లలో ఉన్నాయి.
4. బ్యాంకింగ్ నియమాలలో మార్పులు
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సాధారణ ఫీచర్లు, ఛార్జీలకు రాబోయే మార్పుల గురించి తన కస్టమర్లకు తెలియజేసింది. ఇవి ఫిబ్రవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. వీటిలో ఉచిత ATM లావాదేవీ పరిమితులలో సవరణలు, వివిధ బ్యాంకింగ్ సేవల కోసం సవరించిన రుసుములు ఉన్నాయి.
5. ATF రేట్లలో మార్పు
విమాన ఇంధనం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలలో మార్పులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. అంటే ఫిబ్రవరి 1న దీని ధరల్లో మార్పు వస్తే.. విమాన ప్రయాణికుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇప్పటికే.. కొన్ని రూట్లల్లో విమాన ఛార్జీలు విపరీతంగా ఉండగా, విమాన ఇంధనాల ధరలు పెరిగిపోతే.. ఛార్జీలు సైతం పెరిగిపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.