Lok Sabha elections second phase Updates : సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశలో 12 రాష్ట్రాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. 88 లోక్ సభ నియోజకవర్గాల్లో ఆ రోజు ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. రెండో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
రెండో విడతలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ 12 రాష్ట్రాల్లో గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏప్రిల్ 4 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 5న నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఏప్రిల్ 6న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సాగుతుంది.
నామినేషన్లు ఉపసహరించుకునేందుకు ఏప్రిల్ 8 వరకు గడువు ఉంది. రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: కంగనపై వివాదాస్పద కామెంట్స్.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్..
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలోని ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో రెండో విడతలోనే పోలింగ్ జరగనుంది. అయితే ఇన్నర్ మణిపూర్ లోక్ సభ నియోజకవర్గంలో మాత్రం ఫస్ట్ ఫేజ్ లో ఏప్రిల్ 19న పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
రెండో దశలో బీజేపీకి పట్టున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలో ఎన్నికలు జరగనుండటం ఆసక్తిగా మారింది. అలాగే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ మధ్య గట్టిపోటీ ఉంటుందనే అంచనా ఉంది. బిహార్ లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య పోటీ గట్టి సాగే అవకాశం ఉంది. కేరళలో ముక్కోణపు పోటీ ఉంటుందనే భావిస్తున్నారు.