Congress: వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపిన సుప్రియా శ్రీనేత్ కు కాంగ్రెస్ షాకిచ్చింది. ఆమెకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. 2019లో యూపీలోని మహరాజ్ గంజ్ లోక్ సభ స్థానం నుంచి సుప్రియా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఈసారి టిక్కెట్ తనకే దక్కుతుందని ఆశించారు. అయితే మహరాజ్ గంజ్ అభ్యర్థిగా వీరేంద్ర చౌదరికి కాంగ్రెస్ అవకాశం కల్పించింది. తాజా వివాదం నేపథ్యంలోనే సుప్రియాకు టిక్కెట్ ఇవ్వలేదనే చర్చ నడుస్తోంది.
అసలు వివాదమేంటి..? బాలీవుడ్ నటి , బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై సుప్రియా శ్రీనేత్ పెట్టిన పోస్టు పెను వివాదం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి కంగనా బరిలోకి దిగుతున్నారు. ఆమెను ఉద్దేశించి సుప్రియా చేసిన పోస్టుపై తీవ్ర దుమారం రేపింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాలను ఆ పోస్టులో సుప్రియా ప్రస్తావించారు. ఇతరుల వ్యక్తులను దూషించడం మానుకోవాలని సూచించారు.
సుప్రియా పోస్టుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారంలోగా సమాధానం చెప్పాలని కోరింది. ఆ పోస్టులో పేర్కొన్న వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో హుందాగా వ్యవహరించాలని సూచించింది.
Also Read: తమిళనాడులో విషాదం.. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య
సుప్రియా శ్రీనేత్ పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. కంగనాపై ఆమె చేసిన కామెంట్స్ ను తప్పుపట్టింది. వివాదంపై సుప్రియా స్పందించారు. ఆ పోస్టు చేసింది తాను కాదని వివరణ ఇచ్చారు. తన ఇన్ స్టా , ఫేస్ బుక్ అకౌంట్ల యాక్సెస్ చాలామంది వద్ద ఉందని తెలిపారు. మొత్తంమీద ఈ వివాదం నేపథ్యంలోనే ఆమెకు కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ దక్కలేదని చర్చ నడుస్తోంది.