Students died in Cauvery River(Today’s news in telugu): కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కావేరి నది (Kaveri River) నది సంగమం వద్ద ఈతకొడుతూ.. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం వెతకగా.. మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 12 మంది విద్యార్థులు.. ఈతకొట్టేందుకు కనకపుర తాలూకాలోని మేకేదాటుకు వచ్చారు.
అందరూ కలిసి ఈతకొడుతున్న క్రమంలో ఐదుగురు విద్యార్థులు సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ఐదుగురు విద్యార్థులు గల్లంతవ్వడంతో మిగిలిన ఏడుగురు విద్యార్థులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ స్నేహితులు నీటమునిగారని పోలీసులకు చెప్పడంతో.. అక్కడికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల కోసం గాలించారు.
Also Read : లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి
విద్యార్థుల మృతదేహాలు లభ్యమవ్వగా.. పోస్టుమార్టం నిమిత్తం దయానంద సాగర్ ఆస్పత్రికి తరలించారు. మృతులు హర్షిత (20), అభిషేక్ (20), తేజస్ (21), వర్ష (20), స్నేహ (19)గా గుర్తించారు. “సోమవారం (ఏప్రిల్ 29) మధ్యాహ్నం సాత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. 12 మంది విద్యార్థులు సంగమం వద్ద విహారయాత్రకు వెళ్లారు. వారిలో ఐదుగురు విద్యార్థులు దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన విద్యార్థులంతా చనిపోయారు” అని రామనగర ఎస్పీ కార్తీక్ రెడ్డి వెల్లడించారు.