Asif Bashir Sitara E Imtiyaz Hajj | ప్రతీ సంవత్సరం లక్షలాది ముస్లింలు సౌదీ అరేబియా దేశంలోని మక్కా నగరానికి వెళ్లి హజ్ తీర్థయాత్ర చేస్తారు. అయితే గత సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లిన 1300 మంది యాత్రికులు తీవ్ర ఎండతో చనిపోయారు. వేలాది మంది మండుటెండలో నీరసించి కిందపడిపోయారు. ఈ సమయంలోనే పాకిస్తాన్ కు చెందని ఒక ప్రభుత్వ అధికారి అక్కడికి ఒక దైవదూతలా వచ్చాడు. పదుల సంఖ్యలో అపస్మారక స్థితిలో కిందపడి ఉన్న యాత్రికులను ఆస్పత్రికి త్వరగా తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడారు. ఆ యాత్రికులలో ఎక్కువగా భారతీయులే ఉండడం గమనార్హం. ఆ ప్రభుత్వ అధికారికి తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారంతో సన్మానం చేసింది.
రాజధాని ఇస్లామాబాద్లో పాకిస్తాన్ అధ్యక్ష భవనం లో ప్రత్యేక ఇన్వెస్టిట్యూర్ సెరెమొని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సౌదీ అరేబియాలో హజ్ యాత్రికుల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ అధికారి ఆసిఫ్ బషీర్ కు ‘సితార ఎ ఇంతియాజ్’ పురస్కారంతో సన్మానించారు. ఆ కార్యక్రమంలో పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బషీర్ గురించి ఒక ప్రసంగంలో మాట్లాడారు. అవార్డు పొందిన ఆసిఫ్ బషీర్ ప్రస్తుతం పెషావర్ లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన గత ఏడాది హజ్ యాత్రికులకు సేవకుడిగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డాడు.
అలా సౌదీ అరేబియా దేశానికి పాకిస్తాన్ హజ్ యాత్రికులతో పాటు వెళ్లిన ఆసిఫ్ బషీర్.. హజ్ సమయంలో మెక్కా నగరంలో ఉష్టోగ్రతలు 51.8 డిగ్రీ సెల్సియస్ గా ఉండడం గమనించాడు. ఆ తాపానికి చాలా మంది యాత్రికులు వడదెబ్బకు లోనయ్యారు. ముఖ్యంగా హజ్ లో భాగంగా మెక్కా పరిసరాల్లోని మీనా ప్రాంతంలో యాత్రికుల కోసం వేలాది గుడారాలు వేసి ఉంటారు. అక్కడే పాకిస్తాన్, భారత దేశ ముస్లింలు కూడా తాత్కాలికంగా బస చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బషీర్ డ్యూటీ కూడా ఆ గూడారాలలో ఉన్న పాకిస్తానీ హజ్ యాత్రికుల సేవ కోసం నియమించారు.
Also Read: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసు.. ఘటన తరువాత 2 గంటలపాటు బిల్డింగ్లోనే దొంగ!
హజ్ రెండో రోజున చాలా మంది వృద్ధ పాకిస్తానీలు, భారతీయులు, బ్రిటీష్ యాత్రికులు తీవ్ర వేడి కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. వారందరి పరిస్థితి చూసి. బషీర్ మరో అయిదుగురు సహాయకులతో కలిసి వారికి చికిత్స అందించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న భారతీయులను కూడా ఆస్పత్రికి తరలించాలని అందరికీ చెప్పాడు. కానీ అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆ పని చాలా కష్టతరంగా మారింది.
అందుకే కింద పడి ఉన్న యాత్రికులను బషీర్ తన భుజాలపై వాహనాల వరకు సుదూరంగా మోసుకెళ్లాడు. ఒక్కొకరిగా 26 మంది యాత్రికులను తన భుజాలపై మోసుకెళ్లాడు. ఆ 26 మందిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. ఆ తరువాత వారందరినీ రద్దీ ప్రాంతం నుంచి అతికష్టం మీద ఆస్పత్రికి తరలించాడు. బషీర్ సమయస్ఫూర్తి తో వ్యవహరించడం కారణంగానే ఆ వృద్ధ యాత్రికుల ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. అయితే బషీర్ చేసిన ఈ మహత్ కార్యయం వృధా పోలేదు. బషీర్ కాపాడిన వారిలో కొందరు సౌదీలో భారత దౌత్యాధికారి బంధువులు ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆసిఫ్ బషీర్ చేసిన మానవ సేవకు గుర్తింపుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు ఆ దేశ మూడో అతిపెద్ద పౌర పురస్కారం అయిన సితార ఎ ఇంతియాజ్ ను సన్మానించింది.
సితార ఎ ఇంతియాజ్ అంటే భారత దేశంలో పద్మ భూషణ్ తో సన్మానం.