DK Shivakumar News(Karnataka Assembly Elections) : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినా సీఎం పదవిపై చిక్కుముడి వీడలేదు. ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయితీ ఢిల్లీకి చేరింది. సిద్ధరామయ్య రెండురోజులుగా హస్తినలో తిష్ట వేశారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. మొదట బెట్టు చేసినా మంగళవారం మాత్రం హస్తిన బాటపట్టారు.
ఢిల్లీ వెళ్లే ముందే డీకే చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తానెవరినీ వెన్నుపోటు పొడవనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని శివకుమార్ స్పష్టం చేశారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో కర్ణాటకలో 20 సీట్లు గెలిపించడమే తన లక్ష్యమన్నారు. సీఎం ఎవరనే అంశంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు. పార్టీ నిర్ణయం ఏదైనా దానికి కట్టుబడి ఉంటానన్నారు.
డీకే చేసిన కామెంట్స్ మొత్తం ఎపిసోడ్ పై క్లూ ఇచ్చాయి. వెన్నుపోటు పొడవను అన్నారంటే ..సీఎం పదవి సిద్ధరామయ్యకు ఖాయమైందనే అర్ధమవుతోంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనను అని డీకే అన్నారంటే.. తనకు పదవి రాదనే నిర్ణయానికి వచ్చారని తేలిపోయింది.
సీఎం పదవి తనకే దక్కాలన్న పట్టుదలతో పార్టీ అధిష్టానానికి తొలుత బలమైన సంకేతాలే డీకే పంపించారు. సీఎం పదవి పంపకాలపై సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారని వార్తలు వచ్చాయి. తొలుత 2 ఏళ్లు సీఎం పదవిలో తాను ఉంటానని ఆ తర్వాత 3 ఏళ్లు శివకుమార్ కు ఇస్తామని సిద్ధూ ప్రతిపాదించారని తెలిసింది. కానీ తనకే 5 ఏళ్లు పదవి ఇవ్వాలని డీకే పట్టుబట్టారని సమాచారం. ఆ తర్వాత డీకేపై ఉన్న ఐటీ, ఈడీ కేసుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సిద్ధూ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపిందని లీకులు వచ్చాయి.
ఇప్పుడు డీకే ఢిల్లీకి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. మరి డీకే కాంప్రమైజ్ అయ్యారా?. వెనక్కి తగ్గారా..? అందుకే ఢిల్లీ వెళ్లారా..? ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకుంటారా..? సిద్ధరామయ్య ప్రాతిపదనలకు ఓకే చెప్పారా..? రెండేళ్ల తర్వాతా డీకే సీఎం అవుతారా..? కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమేంటి..?