Heatwave Alert: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాబోయే మూడు రోజులలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుదల ఉంటుందని వాతావరణ శాఖ పెరిగింది.
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నాడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాలకు మాడుపగిలే సమాచారం ఇచ్చింది భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ వేసవి సీజన్లో తెలుగు రాష్ట్రాల పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించింది.
ఫిబ్రవరి నెలలోనే వేసవి కాలం ఎంట్రీ ఇచ్చిందా అన్నంతగా ఏపీలో ఎండలు మండుతున్నాయి. గత నెల 24న నంద్యాల జిల్లా బండిఆత్మకూరులో 38.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో సూర్యుడు మార్చి నెల నుంచే సుర్రుమనిపించనున్నాడు. ఏప్రిల్, మేలో సూర్యుడు మరింత మండనున్నాడు. భానుడు భగభగా మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.
వేసవి కాలం ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండడానికి నిపుణులు కొన్సి సూచనలు చేస్తున్నారు. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నం నీడలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం, టోపి పెట్టుకోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. డీ హైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్య రంగంలో నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఆ గ్రామం సేఫ్.. వేలమందిని కాపాడిన ఆచారం
ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాల అధికారులకు జాగ్రత్తలు, సూచనలు పంపిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణ నష్టాన్ని తగ్గించ గలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపథ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.