Minta Devi Bihar: ఒక్కసారిగా దేశవ్యాప్తంగా నా పేరు.. నా ఫోటో.. నా వయసు చర్చలోకి వచ్చేస్తే, నేను ఏం చేసానో నాకు అర్థం కావడంలేదు.. ఈ మాటలు అంటున్నది బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లాలోని ఓ సాధారణ గృహిణి మింతా దేవి. కానీ, ఆమె పేరు మాత్రం ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు వేసుకున్న టీ-షర్టుల మీద మెరిసింది. ఆ టీ-షర్టులపై ‘124 ఏళ్ల మింతా దేవి’ అని రాసి ఉంది. అయితే మింతా దేవి అసలు వయసు 34 ఏళ్లు మాత్రమే అని చెబుతున్నారు. ఎవరో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ఆమె వయసు 124 ఏళ్లుగా నమోదు చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిన ఈ విషయంపై మింతా దేవి స్వయంగా స్పందించడంతో, అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
బీహార్ సివాన్ జిల్లా నివాసి మింతా దేవి ఓ సాధారణ ఓటరు. కానీ ఆమె పేరు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో ‘124 సంవత్సరాల వయసు’తో ఉండటం, దానిని పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నిరసన ఆయుధంగా మార్చుకోవడం, ఇది చూసి మింతా దేవి ఆశ్చర్యపోయింది. ఈ రోజు పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ‘SIR’ (Special Investigation Request) డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆ నిరసనలో భాగంగా వారు మింతా దేవి ఫోటో, పేరు, 124 years old అని రాసిన టీ-షర్టులు ధరించారు. దీనితో ఈమె ఎవరన్న విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ ఊపందుకుంది.
ఎట్టకేలకు మింతా దేవి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రెండు, నాలుగు రోజుల క్రితమే నాకు తెలిసింది. ఈ ఎంపీలు ఎవరు నాకు? ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ నాకేమిటీ? వాళ్లకి నా ఫోటో వేసుకునే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
తన వ్యక్తిగత జీవితం, వయసు రాజకీయాల్లో ఇలా వాడుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. నా వయసు తప్పుగా రాయబడింది అంటే, అది సరిచేయమని నేను కోరుకుంటాను. కానీ ఎవరు నా వయసు పేరుతో రాజకీయాలు చేసుకోవడానికీ నేను సమ్మతించనని అన్నారు. అలాగే ఆమె, ఈ తప్పు ఎలా జరిగిందో ప్రశ్నించారు. ఎవరు ఈ డేటా ఎంటర్ చేశారో, కళ్ళు మూసుకొని చేశారా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మింతా దేవి ఆధార్ కార్డులో తన పుట్టిన తేదీ 15-07-1990 అని స్పష్టంగా ఉందని చెప్పారు.
Also Read: Thief viral video: తాళం బ్రేక్ కాదు.. జస్ట్ ఇలా ఓపెన్! దొంగ ‘పెట్రోల్ ట్రిక్’తో పోలీసులు కూడా షాక్!
ఇక మరో ఆసక్తికరమైన పాయింట్ కూడా ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వం కంటికి నేను 124 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని అయితే, నాకెందుకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, ఈ విషయం పై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రతినిధులు తనను సంప్రదించలేదని, ఎన్నికల జాబితాలోని తన వివరాలు తక్షణమే సరిచేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
మింతా దేవి ప్రకారం, ఓటర్ల జాబితాలో ఇలాంటి తప్పులు కేవలం ఆమెకే కాకుండా మరికొంత మందికీ ఉన్నాయని భావిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ విషయంపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద, ఒక చిన్న డేటా ఎంట్రీ తప్పు ఇప్పుడు జాతీయ రాజకీయ వేదికపై పెద్ద చర్చగా మారింది. పార్లమెంట్లో ఈ టీ-షర్ట్ నిరసన, మీడియా హడావిడి, సోషల్ మీడియా చర్చలు.. ఇవన్నీ కలసి మింతా దేవి పేరును దేశం మొత్తం తెలిసేలా చేశాయి. కానీ ఆమె మాత్రం.. నా వయసు పొరపాటును సరిచేయండి, కానీ నన్ను రాజకీయాల్లోకి లాగవద్దని కోరుతున్నారు.