Kejriwal arrest Updates: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాల జోక్యంపై భారత్ మరోసారి తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు. ఈ వ్యవహారంపై రిపోర్ట్స్ ను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. ఇలా అగ్రరాజ్యం స్పందించడంపై భారత్ అభ్యంతరం తెలిపింది.
ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు భారత్ నోటీసులు జారీ చేసింది. యూఎస్ రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాను పిలిచి ఈ విషయంపై మాట్లాడింది. బెర్బేనా బుధవారం ఢిల్లీ సౌత్ బ్లాక్ లోని భారత్ విదేశాంగ శాఖ ఆఫీస్ కు వచ్చారు.
30 నిమిషాలపాటు భారత్ అధికారులు.. బెర్బేనాతో మాట్లాడారు. భారత్ సౌర్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ప్రజాస్వామ్య దేశాల విషయంలో బాధ్యతతో వ్యవహారించాలని గట్టిగా చెప్పింది. లేదంటే దౌత్య బంధాలు దెబ్బతింటాయని పేర్కొంది. భారత్ లో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాలపై మాట్లాడటం సరికాదని అమెరికాకు భారత్ తేల్చి చెప్పింది.
Also Read: టెన్షన్లో కేజ్రీవాల్ మద్దతుదారులు, తీర్పు ఎటు వైపు?
ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ స్పందించింది. అప్పడు కూడా భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ ప్రజాస్వామ్య దేశంగా పేర్కొన్న జర్మనీ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో పారదర్శకంగా విచారణ జరగాలని పేర్కొంది. భారత్ లోని చట్టపరంగా ఉన్న అన్ని మార్గాలను కేజ్రీవాల్ వినియోగించుకోవాలని సూచించింది. భారత్ అంతర్గత వ్యవహారంలో జర్మనీ తలదూర్చడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనీ రాయబారికి నోటీసులు ఇచ్చింది. వివరణ కోరింది. ఇప్పుడు అమెరికాకు అదేరీతిలో బదులిచ్చింది.