Free Ride Home: న్యూ ఇయర్ వేడుకల వేళ కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నూతన సంవత్సర సంబరాల్లో పీకలదాకా తాగి, ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉన్నవారిని పోలీసులే స్వయంగా వారి ఇళ్లకు సురక్షితంగా చేరవేస్తారని కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర బుధవారం ప్రకటించారు. ప్రజల భద్రత దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే ఈ ఆఫర్ అందరికీ కాదని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైతే మద్యం మత్తులో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటారో, కనీసం నడవలేని స్థితిలో ఉంటారో (Severely Inebriated).. వారిని మాత్రమే పోలీసులు గుర్తించి ప్రభుత్వ వాహనాల్లో ఇళ్లకు తరలిస్తారు. ఇది ప్రధానంగా బెంగళూరులో అమలులో ఉంటుంది. ఒకవేళ మత్తులో ఉండి, ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ఇతరుల కోసం ప్రభుత్వం నగరంలో 15 తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలను (Resting Locations) ఏర్పాటు చేసింది. అక్కడ వారి మత్తు దిగేవరకు ఉంచి, ఆ తర్వాతే ఇంటికి పంపిస్తారు. బెంగళూరుతో పాటు మైసూర్, హుబ్బళ్లి, బెళగావి, మంగళూరు నగరాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ మాట్లాడుతూ.. బెంగళూరు నగరంలో న్యూ ఇయర్ భద్రత కోసం ఏకంగా 20,000 మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక మహిళా స్క్వాడ్లను రంగంలోకి దించారు. జనసమ్మర్ధం, ట్రాఫిక్ను పర్యవేక్షించేందుకు డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. విధుల్లో ఉండే పోలీసులకు బాడీ కెమెరాలను అమర్చారు; వీటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు.
ఇంటికి దిగబెడతామని చెప్పారు కదా అని ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం బెంగళూరు వ్యాప్తంగా 160 ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోనూ హై అలర్ట్ ప్రకటించినట్లు హోం మంత్రి తెలిపారు. అందరూ బాధ్యతగా, సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని ఆయన కోరారు.
Read Also: Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్లో పార్టీ!