Update on Kavitha Bail petition: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెల్లడించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు రూస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను విచారించారు. కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
కవిత అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని.. చట్ట విరుద్ధమని అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అతను భయంతో ఉన్నాడని.. ఈ సమయంలో తల్లి పాత్ర అవసరమని అన్నారు.
మరోవైపు వాదనలు వినిపించిన ఈడీ, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర కవిత పోషించారని, ప్రణాలికలు రచించింది కూడా కవితనేనని స్పష్టం చేశారు. కవిత తన ఫోన్లో కీలక డేటాను డిలీట్ చేశారని, నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవిజా తీర్పును రిజర్వ్ చేశారు.
Also Read: కేజ్రీవాల్ ఫోన్ అనలాక్కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ..
మద్యం స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీ వరకూ ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైలులో ఉన్నారామె. కస్టడీకి ముందే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్న కారణంగా ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేసి కవితకు అనుకూలంగా బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇక .. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఏప్రిల్ 15 వరకూ ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. తీహార్ జైలుకు తరలించారు.