Kejriwal ed custody news(Telugu breaking news): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో.. మధ్యాహ్నం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. కేజ్రీవాల్ ను మరో 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ వారంరోజులు చేసిన విచారణ మొత్తాన్నీ రికార్డ్ చేశామని, కేజ్రీవాల్ తప్పించుకునేలా సమాధానాలు చెబుతున్నారని పేర్కొంది. గోవా ఆప్ ఎమ్మెల్యేలతో కలిపి కేజ్రీవాల్ ను విచారించాలని ఈడీ కోర్టుకు తెలిపింది.
తనను ఎన్నిరోజులు కస్టడీకి తీసుకున్నా ఏం ఇబ్బంది లేదన్నారు కేజ్రీవాల్. ఈ కేసులో ఈడీ తనపేరును నాలుగుసార్లు ప్రస్తావించినంత మాత్రాన తాను నిందితుడి అయిపోనని కేజ్రీవాల్ వాదించారు. ఈ కేసును రాజకీయకుట్రగా వర్ణించారు. ఆప్ ను ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని, న్యాయమే గెలుస్తుందని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి కావేరి బవేజ.. మరో నాలుగు రోజులు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఏప్రిల్ 1 వరకూ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
మరోవైపు ఢిల్లీ చీఫ్గా అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పాలనా పరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ కు సీఎం పదవికి రాజీనామా విషయంలో స్వల్ప ఊరట లభించింది.
ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ గత గురువారం (మార్చి 21) కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. మరుసటి రోజు కోర్టులో హాజరు పరచగా.. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా అతనిని మార్చి 28 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించారు. కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీలో విచారించాలని ఏజెన్సీ ఒత్తిడి చేయడంతో కోర్టు కేజ్రీవాల్ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది.
Also Read : సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్.. తాత్కాలిక బెయిల్కు నిరాకరించిన హైకోర్టు
కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ బుధవారం కేజ్రీవాల్ ను కలిశారు. ఆ తర్వాత.. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన కోర్టులో చెబుతారని మీడియాకు తెలిపారామె. ఈడీ ఇప్పటి వరకూ 250 ప్రాంతాల్లో సోదాలు చేసినా ఒక్కరూపాయి కూడా దొరకలేదని, సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఇళ్లలోనూ ఒక్క రూపాయి దొరకలేదన్నారు. కేజ్రీవాల్ భౌతికంగా జైల్లో ఉన్నా.. ఆయన మనసంతా ప్రజల దగ్గరే ఉందన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరక్ సింగ్ రావత్కు మరోసారి PMLA కింద సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 2న అతన్ని విచారణకు పిలిచింది. అటవీ శాఖను అక్రమంగా ఆక్రమించిన కేసులో హరక్ సింగ్ రావత్కు ED సమన్లు జారీ చేసింది. గతంలోనూ ఆయన సమన్లు జారీ చేయగా.. ఈడీ విచారణకు హాజరుకాలేదు.