Varun Gandhi : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన యూపీలోని పీలీభీత్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. యూపీ మంత్రి జితిన్ ప్రసాద్ కు పీలీభీత్ ఎంపీ సీటును కాషాయ పార్టీ ఇచ్చింది.
వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలోకి ఆహ్వానించింది. వరుణ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో ఆయన పీలీభీత్ ప్రజలకు భావోద్వేగపూరిత లేఖ రాశారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గంతో తనకు విడదీయరానీ బంధం ఉందని పేర్కొన్నారు.
3 ఏళ్ల వయస్సులోనే పీలీభీత్ లో అడుగుపెట్టానని వరుణ్ గాంధీ గుర్తు చేసుకున్నారు. 1983లో తన తల్లి మేనకా గాంధీతో కలిసి ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన ఎంపీ పదవీకాలం ముగిసిపోయినా.. ఇక్కడ ప్రజలతో బంధం తుదిశ్వాస వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు. వారి ఆకాంక్షలు తీర్చడానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ పదవి లేకపోయినా కొడుకు మాదిరిగా ప్రజలకు సేవలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సామాన్యుల న్యాయం చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
Also Read: కంగనపై వివాదాస్పద కామెంట్స్.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్..
కొంతకాలంగా వరుణ్ గాంధీ బీజేపీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో గతేడాది కేదార్ నాథ్ లో కాంగ్రెస్ నేత, తన సోదరుడైన రాహుల్ గాంధీతో భేటీపై చర్చ జరిగింది. బీజేపీపై విమర్శల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పీలీభీత్ సీటు వరుణ్ గాంధీకి దక్కలేదు. అయితే వరుణ్ తల్లి మేనకా గాంధీకి బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. యూపీలోని సుల్తాన్పుర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. కొడుకు దారెటు అనేది మాత్రం ఆసక్తిగా మారింది.