Alappuzha Murder: కేరళలోని అలప్పుజ జిల్లాలో సమాజం తలదించుకునే అత్యంత దిగ్భ్రాంతికర సంఘటన వెలుగుచూసింది. కేవలం ఒక ఐఫోన్, ఖరీదైన బైక్ ఆశ కోసం ఒక 13 ఏళ్ల బాలిక.. తన ప్రియుడు , అతని స్నేహితులతో కలిసి సొంత తాతనే దారుణంగా హత్య చేయించింది.
హత్యకు వ్యూహం.. నేరానికి వేదిక
అలప్పుజకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. గతంలో తాత తనతో దురుసుగా ప్రవర్తించాడనే కోపంతో ఉన్న బాలిక, అతడిని మట్టుబెట్టాలని తన ప్రియుడికి చెప్పింది. దీనికి తోడు ఇంట్లోని బంగారాన్ని దోచుకుని, ఆ డబ్బుతో తనకు ఐఫోన్, ప్రియుడికి బైక్ కొనాలని ప్లాన్ వేశారు.
లైవ్ వీడియో కాల్తో రాక్షసానందం
ప్లాన్ ప్రకారం ప్రియుడు, మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి రాత్రి వేళ ఇంట్లోకి జొరబడ్డాడు. ఇద్దరు వెంటిలేటర్ ద్వారా, మరొకరు మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్లి వృద్ధుడిని గట్టిగా కట్టేసి, విచక్షణారహితంగా కొట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఈ దారుణం జరుగుతున్నంత సేపు నిందితులు బాలికకు వీడియో కాల్ చేసి లైవ్లో చూపించడం గమనార్హం.
పోలీసుల దర్యాప్తు.. నిందితుల అరెస్ట్
హత్య అనంతరం ఇంట్లోని సుమారు 4 తులాల బంగారాన్ని దొంగిలించి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగి, బాలికతో పాటు ఆమె ప్రియుడు, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. మోజుల కోసం సొంత రక్తాన్నే బలితీసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!