Konda Sushmitha: వరంగల్ జిల్లా రాజకీయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలనే నేరుగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం, టీపీసీసీ తీవ్రంగా పరిగణించాయి. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులే బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, మూడు రోజుల్లోగా సమాధానం సమర్పించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యం
వరంగల్లోని గీసుగొండలో నిర్వహించిన తన తల్లి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సుస్మిత, అధిష్ఠానానికి వి విసిరేలా కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉంటారని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావడంలో మా తల్లిదండ్రుల పాత్ర ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. కొండా మురళికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి మాట తప్పారు. తమ మద్దతు లేకుండా పరకాలలో ఎవరూ గెలవలేరు. సీఎం రేవంత్ నేరుగా వచ్చి ప్రచారం చేసినా రేవూరి గెలవరు. వచ్చే 20 ఏళ్ల పాటు పరకాలకు తానే ఎమ్మెల్యేను, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తా’ అని సంచలన ప్రకటనలు చేశారు.
ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు
కేవలం సీటు ప్రకటనపైనే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై సుస్మిత నేరుగా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. సీఎం సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, షెల్ కంపెనీల ద్వారా సుమారు రూ. 200 కోట్ల విలువైన ల్యాండ్ డీల్ కొట్టేసేందుకు ప్రణాళిక వేశారని ఆరోపించారు. ఎవరికీ భయపడేది లేదని, తన వ్యాఖ్యలకు ఎవరైనా కౌంటర్ ఇస్తే కాంగ్రెస్ నేతల బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడతానని హెచ్చరించారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి కుమార్తెగా ఉంటూ సొంత ప్రభుత్వంపైనే రూ. 200 కోట్ల స్కామ్ ఆరోపణలు చేయడం కాంగ్రెస్ శ్రేణులను, రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.
రాజకీయ పరిణామాలు.. అధిష్ఠానం చర్యలు
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కఠిన వైఖరి అవలంబిస్తోంది. మంత్రి కొండా సురేఖ ఇచ్చే వివరణ ఆధారంగా పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్లతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో కూడా రేవంత్రెడ్డిపై సుస్మిత పరోక్ష విమర్శలు చేయగా, కొండా సురేఖ దంపతులు క్షమాపణలు చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్లీ బహిరంగంగా ప్రభుత్వ ప్రతిష్ఠను, సీఎం ఇమేజ్ను మసకబార్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని టీపీసీసీ తేలిగ్గా తీసుకోవడం లేదు. అధికారం ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారుతున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: హర్మూజ్లో ఇరాన్కు మైండ్ బ్లాంక్ సీన్.. 80% నౌకలు అటే.. అసలు ఒమన్ ప్లాన్ ఏంటి?