Kerala Bus Accident: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కున్నంకుళం సమీపంలోని పరయంబడమ్ వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అమాయక మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కోజికోడ్ నుంచి త్రిస్సూర్ వైపు వెళ్తుంది ఓ ప్రైవేట్ బస్సు. పరయంబడమ్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే వెళ్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఆపై వేగం అదుపు కాక రోడ్డుపై ఉన్న ఓ వ్యాన్తో పాటు మరో రెండు వాహనాలను వరుసగా గుద్దుకుంటూ వెళ్లింది. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న ఒక ఇంటి ప్రహరీ గోడను బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లింది.
ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని కారు నడుపుతున్న ఫాతిమాగా పోలీసులు గుర్తించారు. అలాగే మరో 24 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు నడిపిన డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: మీ దగ్గర చేనేత బట్టలు ఉన్నాయా? అయితే PM మోదీ ట్రెండ్ను మిస్సవ్వకండి!